ఆస్పత్రిలో అమ్మను చూడకపోవడం నా దురదృష్టం: పన్నీరు ఆవేదన
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితను చూడకపోవడం తన దురదృష్టమని ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నై: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితను చూడకపోవడం తన దురదృష్టమని ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ(జయలలిత) ఆస్పత్రిలో ఉన్నప్పుడు తాను చూడలేదని, మాట్లాడలేదని చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
నన్ను తొలగించే అధికారం శశికళకు ఎక్కడిది?: పన్నీరు సంచలనం
వైద్యం జరుగుతున్నందున జయలలితను ఎవరూ చూడకూడదని వైద్యులు చెప్పారని పన్నీరు సెల్వం తెలిపారు. దీంతో తాను కూడా వైద్యులపై ఒత్తిడి చేయలేదని అన్నారు. 75రోజులపాటు ఆస్పత్రికి వెళ్లినా అమ్మను కలవడం సాధ్యం కాలేదని చెప్పారు. ఆమెను చూడకపోవడం తన దురదృష్టమని మరోసారి వాపోయారు.
జయలలిత మృతిపై ఉన్న సందేహాలను తీర్చాల్సింది ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. షీలాతో సహా ప్రభుత్వ అధికారులు రాజీనామా చేయడం వారి వ్యక్తిగత విషయమని పన్నీరు సెల్వం చెప్పారు. డీఎంకేతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అమ్మ పార్టీని రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు. జరిగిన వాటిలో తాను 10శాతమే చెప్పానని అన్నారు.
పార్టీ పదవుల నుంచి తనను ఎవరూ తప్పించలేరని ఆయన తేల్చి చెప్పారు. అమ్మ కట్టబెట్టిన పదవి నుంచి తప్పించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. పార్టీ, అన్నాడీఎంకే పార్టీ ట్రెజరర్ పదవి నుంచి పన్నీరును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తొలగించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. అమ్మ పెట్టిన పార్టీ, తమిళ ప్రజల ఆశయాల కోసం తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.