అక్కడ గెలుపు.. రెట్టింపు ఆనందాన్నిచ్చింది, ప్రజలు జీఎస్టీకి, మాకూ అండగా నిలిచారు: మోడీ
న్యూఢిల్లీ: గుజరాత్ విజయం తనకు రెట్టింపు సంతోషాన్నిచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సోమవారం రాత్రి ఢిల్లీలో సమావేశమైంది.
Recommended Video
ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ గుజరాత్లో సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మంత్రం ఫలించిందని అన్నారు. తాను రాష్ట్రం విడిచి వెళ్లినా.. సహచర నేతలు అభివృద్ధి పనులను కొనసాగించారని, గుజరాత్లో సుపరిపాలన వల్లే ప్రజలు మళ్లీ తమకు అవకాశం ఇచ్చారని ప్రధాని వ్యాఖ్యానించారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రజలు కూడా తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే నమ్మకంతోనే బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్, ఇతర శక్తులు అన్ని రకాలుగా ప్రయత్నించాయని, తప్పుడు ప్రచారం కూడా చేశారని మోడీ మండి పడ్డారు.
అభివృద్ధిని అపహాస్యం చేస్తే ప్రజలు సహించరని, పార్టీ ఏదైనా ఇదే విధంగా గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్లో ఐక్యత మంత్రంతో అందరినీ కలుపుకొని ముందుకెళ్దామని ప్రధాని ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులకు సూచించారు.
అభివృద్ధితోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. జీఎస్టీ వల్ల యూపీ, గుజరాత్, హిమాచల్లో బీజేపీ ఓడిపోతుందని ప్రచారం చేశారు. ప్రజలు మాత్రం జీఎస్టీని అంగీకరించి.. మాకు అండగా నిలిచారు. దేశం సంస్కరణలకు సిద్ధంగా ఉందని ఈ ఫలితాలు నిరూపించాయి