నన్ను రేప్ చేస్తానని బెదిరించారు: విద్యార్థిని ఆరోపణ
గుర్మెహర్ కౌర్ అనే విద్యార్థిని ఏబీవీపీపై సంచలన ఆరోపణలు చేసింది. తనను రేప్ చేస్తానని కూడా బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది.
న్యూఢిల్లీ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)పై సంచలన ఆరోపణలు చేసింది గుర్మెహర్ కౌర్ అనే విద్యార్థిని. ఏబీవీపీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి తనకు ఎన్నో బెదిరింపులు వస్తున్నాయని, రేప్ చేస్తానని కూడా బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది.
గుర్మెహర్ కార్గిల్ యుద్ధంలో చనిపోయిన కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె. బుధవారం ఢిల్లీలోని రమ్ జాస్ కాలేజీ దగ్గర జరిగిన ఘర్షణల తరువాత తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని ఆమె వెల్లడించింది.
''సోషల్ మీడియాలో నాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి. మీరు నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే నన్ను జాతి వ్యతిరేకిగా చూపిస్తూ వచ్చిన బెదిరింపులను కూడా చూడొచ్చు. ఇలా రేప్ చేస్తామంటూ బెదిరించడం ఆందోళన కలిగిస్తోంది..'' అని గుర్మెహర్ పేర్కొంది.
''రాహుల్ అనే వ్యక్తి నన్ను రేప్ చేస్తానంటూ ఓ పెద్ద కామెంట్ పోస్ట్ చేశాడు. అది చూసి చాలా భయపడ్డాను..'' అని ఎన్డీ టివీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్మెహర్ వెల్లడించింది. అయితే ఆమె ఆరోపణలను ఏబీవీపీ తిప్పి కొట్టింది.
ఎక్కడ చూసినా మన దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లినట్లు కనిపిస్తున్నది. దీనిని ఏబీవీపీ తీవ్రంగా నిరసిస్తుంది అని ఆ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ బహుగుణ వ్యాఖ్యానించారు.
గత వారం రమ్ జాస్ కాలేజీలో జరిగిన ఓ సెమినార్ కు దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఉమర్ ఖాలిద్ ను ఆహ్వానించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంగానే కాలేజీ దగ్గర ఘర్షణలు జరిగాయి.
ఈ గొడవ తరువాత శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. 'నేనూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినే. నేను ఏబీవీపీకి భయపడను. నేను ఒంటరిని కాదు. దేశంలోని ప్రతి విద్యార్థి నాతో ఉన్నారు..'అంటూ ఆమె పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ పై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ ను 3 వేల మందికి షేర్ చేయగా.. వెయ్యికి పైగా కామెంట్స్ వచ్చాయి.