బిజెపికి సపోర్ట్పై మమత దాటవేత: తన స్పీచ్పై మోడీ
కోల్కతా: రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై విలేకరులు ప్రశ్నిస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్టీ దాటవేత ధోరణి అవలంభించారు. ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే రెండు రోజుల క్రితం ఆమెతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన మమతను ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. పొత్తులపై విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆమె స్పందిస్తూ... కొన్ని పరిమితులు ఉన్నాయని, భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు అనే విషయమై ఇంకా నిర్ణయించలేదన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పిఎం పదవికి అర్హుడేనా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు.

పలు సర్వేలు బిజెపికి 150 సీట్లు వస్తాయని చెబుతున్నాయని, ఇప్పుడు మాత్రం తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ఎక్కువ సీట్లు కైవసం చేసుకొని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అరవై సీట్లలోపే గెలుస్తుందన్నారు.
మరోవైపు, చిదంబరం, మోడీల మధ్య కొనసాగుతున్న వాగ్యుద్ధం మరింత తీవ్రతను సంతరించుకుంది. తన ప్రసంగాలపై పన్ను వేయడం ద్వారా చిదంబరం ఆదాయాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారని మోడీ బుధవారం వ్యాఖ్యానించారు.
ఓ పక్క దేశం కోసం కష్టపడి పనిచేస్తున్నానని చెప్పుకొంటున్న చిదంబరం తన ప్రసంగాలపై సేవా పన్నువేయడమే ఆర్థిక మంత్రి పనిగా పెట్టుకున్నారని మోడీ అన్నారు. చివరికి తన ప్రసంగాలు కూడా ఆదాయాన్ని ఇస్తున్నాయని ఇది తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోడీ ఉద్ఘాటించారు.












Click it and Unblock the Notifications