బీజేపీ హిందీ రాష్ట్రాలకే పరిమితం కాలేదు..రాజకీయ పండితులు తమ వాదనను వీడాలి: మోడీ
తాను ముందుగా బీజేపీ కార్యకర్తనని ఆ తర్వాతే దేశానికి ప్రధాని అని చెప్పారు నరేంద్ర మోడీ. లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం నమోదు చేసిన తర్వాత సొంత నియోజకవర్గం వారణాసికి వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ముందుగా కాశీవిశ్వనాథుని ఆలయాన్ని సందర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని అనంతరం నేరుగా కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఒక బీజేపీ కార్యకర్తగా తనకున్న డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఏప్రిల్ 25వ తేదీని వారణాసికి తానొచ్చినప్పుడు ప్రపంచం మొత్తం వారణాసి వైపు చూసిందని చెప్పారు. కార్యకర్తలంతా మరో నెలరోజుల పాటు వారణాసికి రావొద్దని ఆదేశించారు. మే 19న కాశీకి వద్దామని భావించినప్పటికీ కార్యకర్తల ఆదేశాల మేరకు తాను ఇక్కడికి రాకుండా కేదార్నాథ్కు వెళ్లినట్లు చెప్పారు. తాను వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నట్లు చెప్పారు.
రాజకీయాలకు యూపీ దిశానిర్దేశం చేస్తోంది
పార్టీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు నరేంద్ర మోడీ అనే వ్యక్తి కేవలం నామినేషన్ దాఖలు చేశాడని... ఇక ఎన్నికల పోరు మాత్రం ప్రతి గడపది అవుతుందని తాను చెప్పినట్లు గుర్తు చేశారు ప్రధాని మోడీ. ప్రతి ఒక్కరూ ఒక్కో నరేంద్ర మోడీ అయి ప్రచారాన్ని నిర్వహించినందుకు తమ బాధ్యతగా తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు మోడీ. కేవలం కార్యకర్తల కృషితోనే తాను డిస్టింక్షన్లో పాస్ అయినట్లు మోడీ చెప్పారు. రాజకీయాలకు ఉత్తర్ ప్రదేశ్ కొత్తగా దిశానిర్దేశం చేస్తోందని చెప్పారు మోడీ. 2014, 2017, 2019లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందించారని కొనియాడిన మోడీ.. ఇప్పటికి కూడా రాజకీయ పండితులు కళ్లు తెరవకపోతే తానేమీ చేయలేనని చెప్పారు. ఈ విజయం వెనక ఒక రసాయన చర్య దాగి ఉందని అన్నారు మోడీ.
పారదర్శకత, కష్టపడేతత్వానికి ప్రత్యామ్నాయం లేదు
ఈ ఎన్నికల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపాలని విపక్షాలు ప్రయత్నించాయని కానీ ఓటర్లు మాత్రం పారదర్శకతకు, కష్టపడేతత్వానికే ఓటు వేశారని అన్నారు. పనిచేసే వారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలే గట్టి గుణపాఠం చెబుతారని మోడీ అన్నారు. సమాజంలో పాజిటివిటీ నెలకొనాలని చెప్పారు.ఇక పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కొన్ని వండర్స్ క్రియేట్ చేశారని చెప్పిన ప్రధాని పార్టీలు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉందని అన్నారు. ప్రభుత్వం యొక్క బాధ్యత పనిచేయడమే అని అదే పార్టీ కార్యకర్త ప్రభుత్వంతో చేయి కలిపి పనిచేస్తే కొన్ని అద్భుతాలు చేయొచ్చని అన్నారు. బీజేపీ రెండు సవాళ్లు ఎదుర్కొందని చెప్పిన ప్రధాని బీజేపీ సిద్ధాంతాలను పాటిస్తున్న కార్యకర్తలను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నియంతలు బీజేపీని చెడుగా చూపించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
పేద ప్రజలు సామాన్యుల గొంతుకను వినగలిగాం
పేద ప్రజలు సామాన్యుల గొంతుక వినపడేందుకు చాలా కాలం పట్టిందని ప్రధాని అన్నారు. వారు తమ డిమాండ్లను వినాలని ధర్నాలు నిరసనలు చేపట్టారని అయితే ఓటు బ్యాంకు రాజకీయాల పేరుతో అణగదొక్కారని కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ. వారి ఆవేదనను విన్నాము కాబట్టే ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి 10శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు. ఇక దేశ సంస్కృతిని కాపాడుకుంటూనే... అదే సమయంలో దేశాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని. బీజేపీ ఓటు శాతం దేశవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ ఈ పార్టీని హిందీ ప్రధాన రాష్ట్రాలకే పరిమితం చేస్తున్నారని అన్నారు ప్రధాని మోడీ. లడక్, కశ్మీర్, కేరళ, కర్నాటక, ఈశాన్య భారతంలో తమ విజయాలను గురించి ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు.
ఇక చివరిగా ఇంతటి అఖండ విజయాన్ని సాధించినందుకు ఆ విజయం వెనక కష్టపడిన కార్యకర్తలకు మోడీ అభినందనలు తెలిపారు.