నేను మోడీకి హనుమంతిడిని! నా గుండె చీల్చి చూపిస్తా: చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ లాక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదని, ఆయన తన హృదయంలోనే ఎప్పుడూ ఉన్నారని అన్నారు.
మోడీకి హనుమంతుడిని.. నా గుండె చీల్చి చూపిస్తా
‘నేను ప్రధాని మోడీ ఫొటోను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నా హృదయంలోనే ఉంటారు. నేను ఆయనకు హనుమంతిడిని. అవసరమైతే తాను నా గుండెను చీల్చి చూపిస్తా' అంటూ చిరాగ్ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు ఉపయోగించడం పట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్లిన తర్వాత ప్రధాని మోడీ ఫొటోను ఎందుకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మోడీ ఫొటోలు నితీష్ కుమార్కే అవసరం
ఎల్జేపీ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. నితీష్ కుమార్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీతోనే మన పొత్తు ఉందని, మనం హృదయంతోనే సంబంధాలు పెట్టుకుంటామన్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన ఎల్జేపీ.. జేడీయూ పోటీ చేస్తున్న స్థానాలపైనే అభ్యర్థులను నిలబెడుతుండటం గమనార్హం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇటీవలే కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఎల్జేపీ పూర్తి బాధ్యతలను ఆయన కుమారుడైన 37ఏళ్ల చిరాగ్ పాశ్వాన్ తీసుకున్నారు. తన తండ్రి కోరిక మేరకే తాను ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.
Recommended Video
చిరాగ్ పాశ్వాన్పై బీజేపీ ఫైర్
కాగా, బీజేపీ నేతలు చిరాగ్ పాశ్వాన్పై మండిపడుతున్నారు. రాంవిలాస్ పాశ్వాన్ ఉంటే ఎన్డీఏతోనే ఉండేవారని, కానీ, చిరాగ్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నారని అంటున్నారు. బీజేపీ, జేడీయూల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7లలో జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి.