కరోనా మరణాలపై ఐసీఎంఆర్; 100లో 92 మరణాలు అందువల్లే అంటూ కీలక ప్రకటన
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే కరోనా ప్రభావం పూర్తిగా సమసిపోలేదు అని తెలుస్తుంది. గత 25 రోజులుగా రోజువారి కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయని సమాచారం. ఇక ఇదే సమయంలో కరోనా మరణాలపై పరిశోధన చేసిన ఐసీఎంఆర్ తాజాగా కీలక ప్రకటన చేసింది.
షాకింగ్: కరోనా ఫోర్త్ వేవ్; 4నెలల పాటు విజృంభణ, కొత్త వేరియంట్ల తీవ్రతపై ఆందోళన!!
2022లో సంభవించిన 92శాతం కోవిడ్ మరణాలు టీకాలు వేయని వ్యక్తులలో జరిగాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. వందలాది మంది జీవితాలను రక్షించడంలో వ్యాక్సిన్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయని స్పష్టమవుతోందని ఆయన అన్నారు. వ్యాక్సిన్లు కరోనా మహమ్మారి రాకుండా నియంత్రించలేకపోయినా, మరణాల నుండి కాపాడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా సంభవించిన మరణాలలో ఎక్కువగా వ్యాక్సిన్లు తీసుకోని వారే మరణించినట్లుగా తెలుస్తుంది.
100 మందిలో 92 మంది వ్యాక్సిన్లు తీసుకోక మృతి చెందారని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. దేశ ప్రజలంతా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని, అందరూ విధిగా వ్యాక్సిన్లు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. ఇదిలా ఉంటే శుక్రవారం నవీకరించబడిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, శుక్రవారం నాడు 6,396 మంది కరోనావైరస్ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో భారతదేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,29,51,556కి పెరిగింది.
అయితే క్రియాశీల కేసులు 69,897కి తగ్గాయి. 201 తాజా మరణాలతో మరణాల సంఖ్య 5,14,589కి చేరుకుంది. రోజువారీ కోవిడ్-19 కేసులు వరుసగా 26 రోజులుగా చాలా తక్కువగా ఉన్నాయని ఆరోగ్యశాఖ డేటా వెల్లడించింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.16 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.64 శాతానికి మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ సానుకూలత రేటు 0.69 శాతంగా, వారపు అనుకూలత రేటు 0.90 శాతంగా నమోదు చేయబడింది.