మీ పిల్లలకు టికెట్లు రాకపోవడానికి కారణం నేనే: బీజేపీలో అలా కుదరదన్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వారసత్వ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, అలాంటి వాటికి భారతీయ జనతా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదని స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలోని అంబేద్కర్ కేంద్రంలో జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పార్టీ నేతలు సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టికెట్లు ఇవ్వపోవడానికి కారణం తానేనని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని, అలాంటప్పుడు పార్టీ కూడా అందుకు ఉదాహరణగా నిలవాలని మోడీ స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది పార్టీ పార్లమెంట్ సభ్యులు, నేతలు తమ పిల్లలకు టికెట్లు అడిగారు. అయితే, ఇందులో చాలా మంది అభ్యర్థులను పార్టీ తిరస్కరించింది. ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తన వల్లే మీ పిల్లలకు పార్టీ టికెట్లు ఇవ్వలేదని చెప్పారు. వారసత్వ రాజకీయాలు కులతత్వానికి దారితీస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసి నేతలు, ఎంపీలకు ప్రధాని మోడీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Recommended Video
ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఇది చాలా మంచి సినిమా. మీరందరూ తప్పకుండా చూడాలి. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి అని పార్టీ నేతలతో మోడీ అన్నట్లు తెలిసింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం కాశ్మీర్లో హిందువులపై జరిగిన హత్యాచారాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.