చంపితే దయ్యమై వస్తా: డిఎస్పీ అనుపమ స్టోరీ ట్విస్ట్
బెంగళూరు: తనను హత్య చేస్తే దయ్యమై వస్తానని కర్ణాటకలోని కూడ్లిగీ డిఎస్పీ అనుపమ షనాయ్ వ్యాఖ్యానించారు. ఆమె రాజీనామా వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఆమెకు నెటిజన్ల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తోంది. ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు ఆమె ఫేస్బుక్ ఖాతాలోని పోస్టులను బట్టి తెలుస్తుందనే చర్చ సాగుతోంది.
అనుపమకు చెందిందిగా భావిస్తున్న ఫేస్బుక్ ఖాతాలో సీడీని విడుదల చేస్తానని చెప్తే హత్య చేస్తానని బెదిరిస్తారా, దెయ్యమై వస్తా... అనే పోస్టుతో పాటు డోంట్ అండర్ ఎస్టిమేట్ పవర్ ఆఫ్ ద కామన్ మ్యాన్ అనే పోస్టు ఉంది. దీంతో అనుపమ ప్రాణాలకు ముప్పు ఉందనే చర్చ సాగుతోంది.
బెంగళూరులోని విధాన సౌధలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనుపమ విషయం చర్చకు వచ్చింది. సమావేశం ప్రారంభమైన వెంటనే నాయక్ ఏమిటయ్యా ఇదంతా అనే ముఖ్యమంత్రి ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని, తాను ఏమీ చేయలేదని మంత్రి చెప్పినట్లు సమాచారం.
డీఎస్పీ అనుపమ రిజైన్, ఫేస్బుక్లో కామెంట్స్: ఏం జరిగింది?
కాగా, అనుపమ షినాయ్ రాజీనామాను ఆమోదించవద్దని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. దాంతో పోలీసులు అధికారులు ఆమెతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నాారు. ఈ స్థితిలో ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి బళ్లారిలోని ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరిస్తారని అంటున్నారు.
ఈ నెల 4వ తేీదన ఉద్యోగానికి రాజీనామా చేసిన అనుపమ అజ్ఞాతం నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రిగానే కాకుండా బళ్లారి ఇంచార్జీ మంత్రి పరమేశ్వర్ నాయక్పై ఫేస్బుక్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. అనుపమ రాజీనామాను ఆమోదించవద్దని, ఆమెతో మాట్లాడి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేలా చూడాలని సిద్ధరామయ్య డిజిపి ఓం ప్రకాష్ను ఆదేశించారు.
దాంతో ఓంప్రకాష్ ఆదేశాల మేరకు బళ్లారి జిల్లా ఎస్పీ తన సిబ్బందిని అనుపమ స్వస్థలం ఉడిపి జిల్లా ఉచ్చిల గ్రామానికి పంపించారు. ఆమె కోసం వాకబు చేయించారు. త్వరలో అనుపమతో పాటు తాము కూడా బళ్లారికి వచ్చి ఉన్నతాధికారులను కలుస్తామని, ఇంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పలేమని తల్లిదండ్రులు నళిని, రాధాకృష్ణ పోలీసులకు చెప్పారు.