సిద్దూపై కెప్టెన్ అమరీందర్ సంచలనం-అతన్ని సీఎం చేస్తే దేశ భద్రతకే ముప్పు-కచ్చితంగా వ్యతిరేకిస్తా
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఆసక్తి నెలకొంది. నాన్ సిక్కు వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపవచ్చుననే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో పీసీసీ చీఫ్గా ఉన్న నవజోత్ సింగ్ సిద్దూను ముఖ్యమంత్రిని చేస్తారా అన్న చర్చ కూడా లేకపోలేదు.ఈ నేపథ్యంలో తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నవజోత్ సింగ్ సిద్దూపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

సిద్దూని సీఎం చేస్తే దేశ భద్రతకే ముప్పు : అమరీందర్
నవజోత్ సింగ్ సిద్దూని ముఖ్యమంత్రిని చేయాలనుకునే ఏ చర్యనైనా తాను వ్యతిరేకిస్తానని అమరీందర్ సింగ్ పేర్కన్నారు.సిద్దూకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని... ఆతన్ని ముఖ్యమంత్రిని చేయడమంటే దేశ భద్రతకే ముప్పు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్,ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా సిద్దూకు స్నేహితులు.పంజాబ్కు పాకిస్తాన్తో 600కి.మీ బోర్డర్ ఉంది.ఓవైపు పాక్ నుంచి పంజాబ్లో నిత్యం డ్రోన్లు,పేలుడు పదార్థాలు,మాదక ద్రవ్యాలు,తుపాకులు కలకలం రేపుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని,ఆర్మీ చీఫ్లతో సంబంధాలున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే అది దేశభద్రతకే పెద్ద ముప్పు.' అని అమరీందర్ వ్యాఖ్యానించారు.

సిద్దూ ఒక అసమర్థుడు : అమరీందర్
సిద్దూ ఒక అసమర్థుడని.. అతను రాజకీయాల్లో ఒక డిజాస్టర్గా మిగులుతాడని అమరీందర్ సింగ్ విమర్శించారు.అయితే సిద్దూని పీసీసీ చీఫ్గానే కొనసాగించాలా లేక ముఖ్యమంత్రిని చేయాలా అన్నది కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. సిద్దూని ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదిస్తే తాను తప్పక వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.'సిద్దూ దేన్ని సరిగా నిర్వహించలేడు.అతని గురించి నాకు బాగా తెలుసు.పంజాబ్ కాంగ్రెస్కు అతనేదో చేసేస్తాడని ఊహించుకోవద్దు.అతనో డిజాస్టర్గా మారబోతున్నాడు.' అని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్లోనే కొనసాగుతానన్న అమరీందర్
కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశానికి కొద్ది గంటల ముందు అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా అనంతరం పార్టీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను చాలా అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.భవిష్యత్ కార్యాచరణపై తన సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

సిద్దూతో అమరీందర్ విభేదాలు
పంజాబ్ పీసీసీ పగ్గాలు నవజోత్ సింగ్ సిద్దూకి అప్పగించడంపై అమరీందర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన మాటను లెక్క చేయకుండా సిద్దూకి పదవి కట్టబెట్టడంపై అమరీందర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సిద్దూ,అమరీందర్ మధ్య చాలాకాలం పాటు కోల్డ్ వార్ నడిచింది.దీంతో ఇద్దరినీ ఢిల్లీకి పిలిచి సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరిగింది.అయితే
ఇటీవల ఈ కోల్డ్వార్ సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ... తాజా పరిస్థితులు గమనిస్తుంటే ఇరువురి మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతున్నట్లుగానే ఉంది. సిద్దూ ప్రోద్బలంతోనే అమరీందర్ సింగ్ వ్యతిరేక వర్గం ఆయనపై తిరుగుబాటు చేస్తూ వస్తోందనే వాదన ఉంది.తాజాగా అమరీందర్ వ్యతిరేక వర్గం అధిష్ఠానానికి లేఖ రాయడం వెనుక కూడా సిద్దూ హస్తం ఉందనే వాదన లేకపోలేదు.అటు అమరీందర్ సింగ్ కూడా అధిష్టానం తన ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోందనే భావనలోనే ఉన్నారు.ఇంత ఒత్తిడి నడుమ సీఎంగా కొనసాగడం కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications