నేపాల్ లాంటి విపత్తు వస్తే ఎలా?: హైకోర్టు హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సృష్టించే విధ్వంసం నివారణకు చర్యలేమీ తీసుకోవడం లేదని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, నగరపాలక సంస్థలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్ తరహా భూకంపం వస్తే ఢిల్లీలో 90శాతం తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించింది.
‘ఢిల్లీ నగరపాలక సంస్థ పరిధిలో కేవలం 25శాతం భవంతులే ప్రణాళిక/ఆమోదం పొందినవని, మిగిలిన 75శాతం ప్రణాళిక లేకుండా అనధికారికంగా నిర్మించినవని ఉత్తర దిల్లీ నగరపాలక సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్లో ప్రమాదకర పరిస్థితిని వెల్లడించింది' అని హైకోర్టు న్యాయమూర్తులు తెలిపారు.
కాగా, ‘ఈ 25 శాతంలోనూ ప్రజలు అనంతరం చట్ట ప్రకారం అనుమతించని విధంగా మరిన్ని నిర్మాణాలు చేపట్టారు. అంటే భవన నిబంధనలకు అనుగుణంగా ఉన్నవి కేవలం 10-15శాతమే.' అని జస్టిస్ బాదర్ దర్రేజ్, జస్టిస్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్దేవతో కూడిన హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, పురపాలక సంస్థలు విపత్తుల కోసం వేచి చూస్తున్నాయి' అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో భవనాలు ఎంత మేర సురక్షితమో తెలియజేయాలని, ముప్పును ఎదుర్కొనేందుకు ఢిల్లీ పురపాలక సంస్థల వద్ద ఉన్న కార్యాచరణ ప్రణాళికలు ఏమిటో తెలియజేయాలని న్యాయవాది అర్పిత్ భార్గవ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

‘నేపాల్లో వచ్చినట్లుగా భూకంపం ఇక్కడ వస్తే మరణాలు వేలల్లో కాదు.. ఢిల్లీ జనాభాలో 90శాతం తుడిచిపెట్టుకుపోతుంది' అని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. భారీ భూకంపం వస్తే పది ఇళ్లల్లో తొమ్మిది కుప్పకూలుతాయని పేర్కొంది.
విచారణ సందర్భంగా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరఫున ఎవరూ హాజరుకాకపోవడం, ప్రకృతి విపత్తుల నుంచి నగరాన్ని సురక్షితంగా ఉంచడానికి తీసుకున్న చర్యల గురించి వెల్లడించకుండా మౌనంగా ఉండడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.
ఢిల్లీ సెస్మిక్ జోన్-4 పరిధిలోకి వస్తుందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని భవంతుల నిర్మాణ నాణ్యత విధానంపై నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉన్న ప్రాంతాలను సెస్మిక్ జోన్-4 పరిధిలో చేరుస్తారు.
భూకంపాల్లో ఇది రెండో అతి పెద్ద ప్రమాద స్థాయి. సెప్టెంబరు 23లోపు నివేదికలు సమర్పించాలని, సెస్మిక్ జోన్-4 ప్రాంతాల్లో అనుసరించాల్సిన జాతీయ భవన నిర్మాణ కోడ్-2005కు అనుగుణంగా ఢిల్లీలో భవన నిర్మాణ నాణ్యత ఉండేలా చూసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో ఆ నివేదికలో తెలియజేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications