మన ఒక్కో జవాన్కు పదిమంది పాక్ సైనికులను చంపండి: సీఎం సంచలన వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో అమరులైన ఒక్కో భారతీయ జవానుకు ప్రతిగా పదిమంది పాక్ సైనికులను చంపిపారేయాలని భారత ఆర్మీని ఉద్దేశించి అన్నారు.
తాజాగా కశ్మీర్లోని భారత సరిహద్దు వెంట పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయారు. ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్గఢ్ సెక్టార్లలోని భారత ఔట్ పోస్టులపై బుధవారం రాత్రి నుంచి పాక్ కాల్పులు ప్రారంభించింది.
ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ 78వ బెటాలియన్కు చెందిన తమిళనాడు వాసి, తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ సురేష్ అమరుడయ్యాడు. ఆయనకు భార్య, 13 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల బాబు ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.
''మన జవాను ఒక్కరు చనిపోతే, పదిమంది పాక్ సైనికులను చంపాల్సిందే. నేను ఇదే చూడాలనుకుంటున్నా..'' అని ఆవేశంగా అన్నారాయన. మరోవైపు పాకిస్తాన్ తీరుపై హోంమంత్రిత్వ శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ స్వభావంలో ఏమాత్రం మార్పు రావడం లేదని సహాయ మంత్రి హన్స్రాజ్ అహిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పంథాను కొనసాగిస్తే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలను మూసివేశారు.