జంగిల్ రాజ్ గురించి మాట్లాడండి: ఉప ముఖ్యమంత్రి
పాట్నా: దేశంలోని ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న జంగిల్ రాజ్ పాలన గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని, బీహార్ మీద పడి ఆరోపణలు చేస్తూన్నారని ఆ రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి, ఆర్ జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజశ్వి యాదవ్ మండిపడుతున్నారు. అసలు ఎందుకు ఇతర రాష్ర్టాల గురించి మాట్లాడటం లేదని సూటిగా ప్రశ్నించారు.
ఆరోపణలు చేస్తున్న వారు జంగిల్ రాజ్ అంటే ఏంటో నిర్వచనం చెప్పాలని డిమాండ్ చేశారు. జేడీయూ ఎమ్ఎల్ సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ నడి రోడ్డు మీద తుపాకితో కాల్చి యువకుడిని దారుణంగా హత్య చేశాడని విపక్షాలు మండిపడుతున్నాయి.
బీహార్ లో ఆటవిక పాలన కొనసాగుతున్నదని ఆరోపించారు. ఈ విషయంపై తేజశ్వి యాదవ్ స్పందించారు. ఇలాంటి సంఘటనలు జరిగిన ఇతర రాష్ర్టాల మీద ఎందుకు దుమ్మెత్తి పోయడం లేదని విపక్షాలను ప్రశ్నించారు. అయితే తప్పు చేసిన బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని హామీయిచ్చారు.
జరిగిన సంఘటన కు విచారిస్తున్నామని, బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెడుతామని, వారికి తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని, అనవసరంగా తమ మీద నిందలు వెయ్యడం సరికాదని ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ అన్నారు.