చేతకాకపోతే చెప్పండి..కేంద్రాన్ని దించుతాం,ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాట్లు ఎవరడిగారు:ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు
'మీవల్ల అవుతుందా కాదా... మాకు మాత్రం నమ్మకం సడలింది...' అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవైపు ఆక్సిజన్ కొరత కారణంగా పేషెంట్లు పిట్టల్లా రాలిపోతుంటే... మరోవైపు ఆక్సిజన్ బ్లాక్ దందా అంతకంతకూ పెరుగుతోందని మండిపడింది. 'ఆక్సిజన్ బ్లాక్ దందాను అడ్డుకోవడం మీవల్ల కాకపోతే చెప్పండి... కేంద్రాన్ని జోక్యం చేసుకోవాల్సిందిగా మేము కోరుతాం...' అని పేర్కొంది. ఢిల్లీలో ఇప్పటివరకూ ఆక్సిజన్ కొరత కారణంగా సంభవించిన మరణాలపై నివేదిక ఇవ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
'జరిగింది చాలు... చేతకాకపోతే చెప్పండి...'
'జరిగింది చాలు... ఇకనైనా పనితీరు మార్చుకోండి... ఒకవేళ మీకు చేతకాకపోతే చెప్పండి,కేంద్ర అధికారులను జోక్యం చేసుకోమని కోరుతాం. అంతేగానీ ప్రజలు ఇలా రాలిపోతుంటే మేము చూస్తూ ఊరుకోలేం.' అని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు విపిన్ సంఘీ,రేఖా పల్లీ పేర్కొన్నారు. మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని... మీ అధికారాలేంటో.. ఎలా పాలించాలో మీకు తెలిసి ఉండాలని అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కి తరలిస్తుంటే మీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని.. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
అక్కడితో చేతులు దులిపేసుకుంటున్నారు...
ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి చేతులు దులిపేసుకుంటోందని... అక్కడినుంచి అవి ఎక్కడికి వెళ్తున్నాయో పర్యవేక్షణ కొరవడిందని హైకోర్టు పేర్కొంది. 'ఓవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజ్ అందక పేషెంట్ల రోధనలు వినిపిస్తుంటే... మీరు మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఆక్సిజన్ ఇచ్చి ఏమైనా చేసుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు...' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అలసత్వంతో డిస్ట్రిబ్యూటర్లు ఆక్సిజన్ను బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారని పేర్కొంది.
గౌతమ్ గంభీర్పై ఫైర్...
బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్పై కూడా ఢిల్లీ హైకోర్టు మండిపడింది. 'గంభీర్కు లైసెన్స్ ఉందా... లేకపోతే భారీ మొత్తంలో అతను మందులు ఎలా కొనుగోలు చేయగలుగుతున్నాడు... అతనికి లైసెన్స్ అవసరం లేదా...' అని ప్రశ్నించింది. కోవిడ్ పేషెంట్లకు తన ఛారిటీ తరుపున గంభీర్ ఉచిత మందులు పంపిణీ చేస్తున్నందునా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. లైసెన్స్ లేని వ్యక్తికి భారీ ఎత్తున మెడిసిన్ ఎలా అందుతోందని నిలదీసింది.
న్యాయవాదులకు ప్రత్యేక ఏర్పాట్లా.. ఎవరడిగారు?
ఇక ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులు,న్యాయ అధికారులు,వారి కుటుంబ సభ్యుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ అయిన అశోకలో 100 పడకలతో ఏర్పాట్లు చేయడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని సుమోటోగా పరిగణిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 'ఓవైపు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క జనాలు ఇబ్బంది పడుతున్నారు... ఇలాంటి పరిస్థితుల్లో మీరు న్యాయవాదుల చికిత్స కోసం ఫైవ్ స్టార్ హోటల్లో ఏర్పాట్లు చేస్తున్నారు...అసలు ఫైవ్ స్టార్ హోటల్లో ఏర్పాట్లు చేయమని మిమ్మల్ని ఎవరిని అడిగారు... జ్యుడీషియరీ అయినంత మాత్రాన ఇంత ప్రత్యేక ఏర్పాట్లేమీ అవసరం లేదు. ఇదంతా మమ్మల్ని శాంతపరిచేందుకేనా..?' అని కోర్టు ప్రశ్నించింది.