బిజినెస్ ఎలా చేయకూడదు?: పాఠంగా మాల్యా చరిత్ర
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి 9,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా దేశం విడిచి పారిపోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యా. యావత్ దేశంలోని ప్రజలంతా తమకు సమయం ఉన్నప్పుడల్లా మాల్యాపై చర్చోపర్చలు చేస్తున్నారు.
గతంలో దేశంలోని బిజినెస్ స్కూళ్లలో మాల్యా వ్యాపార విజయాలకు అనుసరించిన విధానాలపై పాఠాలు బోధించాలని ఆహ్వానించారు. ఇప్పుడు అదే బిజినెస్ స్కూళ్లలోనే విజయ్ మాల్యా కేసు ప్రాధాన్యం కలిగిన పాఠ్యాంశంగా మారింది.
బ్యాంకుల నుంచి మాల్యా తీసుకున్న రుణాల కేసుపై కార్పొరేట్ల నైతిక విలువలు, కార్పొరేట్ గవర్నెన్స్, బ్రాండ్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి అంశాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో ప్రత్యేక చర్చలు సాగుతున్నాయి.
విజయ్ మాల్యా కేసు ఇప్పుడు యువ బిజినెస్ మ్యాన్లకు ఒక కేస్ స్టడీగా మారిపోయిందని పలువురు ప్రొఫెసర్లు అంటున్నారు. ఐఐఎం-అహ్మదాబాద్ సహా ఐఐఎం-లక్కో, ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-ఇండోర్లు మాల్యా వ్యవహారంపై పాఠాలు బోధిస్తున్నాయి.
వీటితోపాటు జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎక్ఎల్ఆర్ఐ)-జెమ్షెడ్పూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి)-హైదరాబాద్, మేనేజ్మెంట్ డెవల్పమెంట్ ఇన్స్టిట్యూట్ (ఎండిఐ) గుర్గావ్ వంటివి కూడా విజయ్మాల్యా జీవన శైలి, వ్యాపారాలు నడిపిన తీరు తదితర అంశాలను భావి యువ మేనేజర్లకు ఒక పాఠ్యాంశంగా వివరిస్తున్నాయి.
విజయ్ మాల్యాపై వివిధ పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాలను కూడా విద్యార్థులకు పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు. మాల్యా కేసుకు సంబంధించిన వివరాలను విద్యార్ధులకు మరింత ఎక్కువ అవగాహన కల్పించే విధంగా సమాచారాన్ని సేకరించి ప్రొఫెసర్లు వివరిస్తున్నారు. ఇదే విధంగా 'సత్యం' రామలింగరాజు కేసు (2009) కూడా ఐఐఎంలలో ప్రధానంగా చర్చకు వచ్చింది.