తీవ్రవాద కుటుంబాలకు భత్కల్ డబ్బులు: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: 'ఇండియన్ మూజాహిదీన్' (ఐ.ఎం) సహా వ్యవస్దాపకుడు రియాజ్ భత్కల్ దేశ వ్యాప్తంగా ఉన్న తీవ్రవాదులకు నిధులు అందజేయడమే కాకుండా.. జైళ్లలో బందీలుగా ఉన్న, పరారీలో ఉన్న ఇండియన్ మూజాహిదీన్ తీవ్రవాదుల కుటుంబాలకు క్రమం తప్పకుండా డబ్బు సాయం అందిస్తూ ఉండేవాడిని 'నేషనల్ దర్యాప్తు ఏజెన్సీ' (ఎన్ఐఏ) ఇక్కడి ప్రత్యేక కోర్టుకు తెలియజేసింది.
దేశవ్యాప్తంగా తీవ్రవాద ఘాతుకాలకు పాల్పడేందుకు ఇండియన్ మూజాహిదీన్ భారీ కుట్ర పన్నిందన్న కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఈ మేరకు ఒక అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటులో పరారీలో ఉన్న ఇండియన్ మూజాహిదీన్ అగ్రనేతలు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ లతో సహా 20 మంది పేర్లను ఎన్ఐఏ పేర్కొంది.
రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు యాసిన్ భత్కల్ ఆయుధాల సరఫరా కోసం నేపాల్లోని మావోయిస్టులతో సంబంధాలు పెంచుకున్నాడు. కాశ్మీర్ నుంచి ఆయుధాలు సేకరించేందుకు అక్కడ తెలిసిన వ్యక్తుల కోసం ప్రయత్నాలు చేసినట్లు యాసిన్ భత్కల్కు రియాజ్ తెలిపినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీటులో పేర్కొంది.