కేంద్రం ప్రకటనతో శాంతించిన వైద్యులు: సమ్మె విరమణ
న్యూఢిల్లీ: జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం వివరణ ఇచ్చింది. వైద్యుల వృత్తికి ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో స్పష్టం చేశారు. వైద్య వృత్తికి, దేశానికి ఈ బిల్లు వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.
'జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు అంశంపై అఖిల భారత వైద్య సంఘంతో విస్తృతంగా చర్చించాం. బిల్లుపై వారి మనసులో ఉన్న సందేహాలను దూరం చేశాం. వైద్య వృత్తికి, దేశానికి మేలు చేయనున్నందునే బిల్లును తీసుకువస్తున్నాం. అఖిల భారత వైద్య సంఘం చెప్పింది విన్నాం. మా అభిప్రాయాలను కూడా వారికి వివరించాం' అని నడ్డా వివరించారు.
కాగా, విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు నివేదిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అనంతకుమార్ లోక్సభలో తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని కోరతామని చెప్పారు.
వైద్య వృత్తిని నిర్వీర్య పరిచేలా జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు ఉందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదిస్తామని కేంద్రమంత్రి ప్రకటించడంతో వైద్యులు ఆందోళన విరమించారు.