ఆ నిర్ణయం ప్రజారోగ్యానికి ప్రమాదకరం? వెంటనే వెనక్కి తీసుకోవాలని.. నేడు దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె..
శుక్రవారం(డిసెంబర్ 11) దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు దిగనున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేదిక్ డాక్టర్లకు సర్జరీలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతినివ్వడాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు వైద్యులు సమ్మెలో పాల్గొననున్నారు. కోవిడ్ 19,ఎమర్జెన్సీ సర్వీసులు,డెలివరీ వైద్య సేవలు మినహా మిగతా వైద్య సేవలను వైద్యులు శుక్రవారం బహిష్కరించనున్నారు.
అనారిగక చర్యగా అభివర్ణించిన ఐఎంఏ
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైద్య వ్యవస్థను తిరోగమన దశకు తీసుకెళ్లడమేనని ఐఎంఏ అభిప్రాయపడింది. పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేదిక్ స్కాలర్స్ను జనరల్ సర్జరీ ప్రాక్టీస్కు అనుమతించడాన్ని తీవ్రంగా ఖండించింది. వ్యవస్థలను మిక్స్ చేసే పద్దతి సరైనది కాదని పేర్కొంది. అనర్హులైన వారిని జనరల్ సర్జరీ ప్రాక్టీస్కు అనుమతించడం అనాగరికమైన చర్యగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఆయుర్వేదిక్ వైద్యులు ఏయే సర్జరీలు నిర్వహిస్తారో పేర్కొన్నారని.. కానీ సాంకేతికంగా వారికి అందుకు ఎటువంటి అర్హత లేదని పేర్కొంది.
ప్రజారోగ్యానికి ప్రమాదమని...
'పరస్పర గుర్తింపు,గౌరవాన్ని' దెబ్బతీసేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు,ప్రాక్టీషనర్స్ ఉద్యమిస్తారని ఐఏంఎ వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు ప్రజారోగ్యానికి ప్రమాదంగా పరిణమిస్తాయని పేర్కొంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆధునిక వైద్య విధానాలను ఆయుర్వేదిక్ వంటి వ్యవస్థలకు సంబంధించిన విద్యార్థులకు నేర్పించవద్దని సూచించింది.మూడు రోజుల క్రితం ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
Recommended Video
తెలంగాణలోనూ ఒకరోజు ధర్నా...
పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేదిక్ వైద్యులను సర్జరీలకు అనుమతిస్తూ గత నెల కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్యూమర్స్,ఆంపుటేషన్ ఆఫ్ గాంగ్రీన్,నాజల్,కాటారాక్ట్ తదితర సర్జరీలకు వారికి అనుమతినిచ్చింది.ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలోని కాగజ్నగర్లో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకరోజు ధర్నా చేపట్టనున్నట్లు ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు డా.కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఐఎంఏ ఉపాధ్యక్షురాలు డా.అనిత మాట్లాడుతూ... పలు దేశాల్లో ఆయుర్వేద చికిత్స విధానాలను పూర్తిగా నిలిపివేశారని గుర్తుచేశారు. కాబట్టి మిక్సోపతి వద్ధు.. అలోపతి ముద్దు అని అభిప్రాయపడ్డారు.