పతంజలి రాందేవ్పై పరువు నష్టం దావా -రూ.1000కోట్లకు ఐఎంఏ నోటీసులు -కేంద్రం హెచ్చరించినా తగ్గని యోగా గురు
కరోనా మహమ్మారి రెండో దశ విలయంలో విలవిల్లాడుతోన్న ప్రజల్ని మరింత గందరగోళానికి గురిచేస్తూ బాబాలు వింతపోకడలు పోతున్నారు. యోగా గురుగా పాపులరై, బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి దగ్గరి వ్యక్తిగా పేరు పొందిన రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అల్లోపతి వైద్య విధానంపై, అల్లోపతి డాక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కేంద్రం హెచ్చరించిన తర్వాత కూడా బాబాగారి తీరు మారలేదు. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ విభాగం ఆయనపై పరువునష్టం దావా వేసింది..
Recommended Video
కరోనాపై కేంద్రం సంచలన ప్రకటన-గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి-కొవిడ్ ప్రోటోకాల్స్ సవరణ,కొత్త గైడ్ లైన్స్
కొవిడ్ వ్యాధిని కట్టడిచేయడంలో ఆధునిక అల్లోపతి వైద్య విధానం విఫలమైందని, అదో పనికిమాలిన సైన్స్ అని యోగా గురు రాందేవ్ ఇటీవల నోరు పారేసుకోవడం, దానిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాబా యూటర్న్ తీసుకోవడం, ఈ ఉదంతంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ జోక్యం చేసుకుని యోగా గురుకు వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లే చెప్పి మళ్లీ అల్లోపతిపై రాందేవ్ ఎదురుదాడికి దిగడం తాజా వివాదానికి దారితీసింది..
అల్లోపతిని నిందిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూనే ఆ వైద్య విధానాన్ని శంఖిస్తూ ఐఎంఏకు 25 ప్రశ్నలను సంధించారు రాందేవ్ బాబా. అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వంటి వాటికి ఇప్పటిదాకా అల్లోపతి ఎందుకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోయిందని ప్రశ్నించారు. థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలైటిస్, ఆస్తమాలు మళ్లీ రోగుల దరిచేరకుండా చేయగల మార్గం ఫార్మా పరిశ్రమ వద్ద ఉందా అని నిలదీశారు. యోగా గురు తాజా చర్య డాక్టర్లను మరింతగా ఇరిటేట్ చేసింది. దీంతో..
ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం బుధవారం నాడు రాందేవ్ బాబాకు పరువునష్టం నోటీసులు పంపింది. ఆధునిక వైద్యంపై యోగా గురు చేసిన వ్యాఖ్యలకు రూ.1,000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని డిమాండ్ చేసింది. కాగా, ఐఎంఏలో కీలక పోస్టుల్లో కొనసాగుతున్న డాకర్టపై రాందేవ్ వారి పతంజలి యోగా పీఠ్ ఎదురుదాడి చేస్తున్నది. ఐఎంఏలోని కొందరు డాక్టర్లు క్రైస్తవ ఏజెంట్లుగా, భారత వ్యతిరేకులుగా పనిచేస్తూ, పతంజలిని, రాందేవ్ బాబాను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని ఆరోపించింది.