భారత్ రేటింగ్ స్వల్పంగా తగ్గించిన ఐఎంఎఫ్: అయినా వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశమే
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటు అంచనాలను స్వల్పంగా తగ్గించింది. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, ఆందోళన పరుస్తున్న డాలర్-రూపాయి ఎక్ఛేంజ్ రేటు, ద్రవ్యోల్బణం దెబ్బకు కఠినతరమవుతున్న మానిటరీ పాలసీ ఇవ్వన్నీ దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెట్టినట్లు తెలుస్తోంది.
ఐఎంఎఫ్ తాజాగా ప్రకటించిన వరల్డ్ బ్యాంక్ ఎకనామిక్ అవుట్ లుక్లో దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెట్టింది. 2018లో దేశీయ వృద్ధిరేటు అంచనాలను 10బేసిస్ పాయింట్లు తగ్గించి, 7.3శాతంగా ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా 2019లో వృద్ధి అంచనాలను సైతం 30బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5శాతం నమోదవబోతున్నట్లు పేర్కొంది.
అంతకుముందు ఇవి 2018లో 7.4శాతం, 2019లో 7.8శాతంగా ఉండనున్నట్లు ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే, ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ, భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని తెలిపింది.
చైనా ఆర్థిక వ్యవస్థ రేటు ఈ ఏడాది 6.6శాతం, వచ్చే ఏడాది 6.4శాతంగానే ఉండనున్నట్లు పేర్కొంది. ఎన్నికల ఏడాదిలో భారత వృద్ధి రేటు ప్రపంచ దేశాలకు పోటీ ఉంటుందని, ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.9శాతంగా ఉండబోతున్నట్లు అంచనా వేసింది.
కాగా, వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్లో భారత్ వృద్ధిరేటు అంచనాలను 2018, 2019ల్లో 0.1శాతం, 0.3శాతం చొప్పున తగ్గించినట్లు తెలిపింది. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్తో ఆయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం దెబ్బకు అంచనాల కంటే కఠినతరంగా మానిటరీ పాలసీని రూపొందించడం లాంటివి భారత్ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపాయని ఐఎంఎఫ్ వెల్లడించింది. కాగా, వారం రోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదకలో భారత్, ఫ్రాన్స్ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.