మధ్యంతర ఎన్నికలు రాబోతోన్నాయ్- సిద్ధంగా ఉండండి: అమిత్ షా సంచలన ప్రకటన
One Nation- One Election: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ నెల 18వ తేదీన మొదలు కాబోతోంది కూడా. దీని తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.
ఈ పరిస్థితుల్లో- రాజకీయంగా ఉత్కంఠతను రేకెత్తిస్తోన్న వన్ నేషన్- వన్ ఎలక్షన్పై కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ను నిర్వహించబోతోంది.

గతంలో ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫాసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలంటూ కేంద్రం ఆదేశాలను జారీ చేసినట్లు ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి.
ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ధారించారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వ హయాంలోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్ను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అమిత్ షా వంటి బలమైన నాయకుడు ఈ అంశంపై స్పందించడం, అది కూడా సానుకూలంగా మాట్లాడటం ఇదే తొలిసారి.
మోదీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తోటి మంత్రులు అశ్వని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ వంద రోజుల్లో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. తమ ప్రభుత్వ ప్రస్తుత హయాంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎప్పుడు జమిలి ఎన్నికలకు వెళ్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ తన తుది నివేదికను అందజేసిందని పేర్కొన్నారు. సానుకూల సిఫారసు చేసిందని వివరించారు. ఎన్నికలకు ఎప్పుడు వెళ్తామంటూ చెప్పడం టూ ఎర్లీ అవుతుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications