ప్రశాంత్ కిషోర్ సంచలనం-జన్ సురాజ్ పేరుతో కొత్త పార్టీ - ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి
ఇప్పటివరకూ దేశంలో పలు జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందిస్తూ గెలుపుబాట పట్టించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఈ మేరకు ఇవాళ సంచలన ప్రకటన చేశారు. సొంతగడ్డ బీహార్ కేంద్రంగా కొత్త రాజకీయపార్టీని పెట్టాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జన్ సురాజ్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ
దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ, వైసీపీ, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, శివసేన వంటి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందించి విజయాలు కట్టబెట్టిన ఘనత ప్రశాంత్ కిషోర్ ది. తాజాగా కేంద్రంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ లేని లోటుపై తీవ్ర ఆవేదనగా ఉన్న పీకే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రధాన విపక్షం కాంగ్రెస్ లో కూడా చేరాలని భావించారు. కానీ అన్ని మార్గాలూ విఫలం కావడంతో తానే స్వయంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ప్రశాంత్ కిషోర్ నిర్ణయించారు.
జన్ సురాజ్ పేరుతో కొత్త పార్టీ
తాను ప్రారంభించబోయే కొత్త పార్టీకి సంబంధించి ఇవాళ ప్రశాంత్ కిషోర్ కొద్దిసేపటి క్రితం పెట్టిన ట్వీట్ సంచలనంగా మారింది. జన్ సురాజ్ పేరుతో తాను కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలనే నా తపన, ప్రజానుకూల విధానాన్ని రూపొందించడంలో సహాయం చేయడం 10 ఏళ్ల రోలర్కోస్టర్ రైడ్కు దారితీసిందంటూ పీకే తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో తాను ఇక ప్రత్యక్షరాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సంకేతం ఇచ్చేశారు.
స్వస్ధలం బీహార్ నుంచే
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ కిషోర్.. దీనికి తన స్వరాష్ట్రం బీహార్ ను అడ్డాగా ఎంచుకుంటున్నారు. గతంలో ఇక్కడే జేడీయూ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అక్కడి నుంచే తన కొత్త రాజకీయ పార్టీకి రూపకల్పన చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా కాంగ్రెస్ తో పనిచేయాలని నిర్ణయించి, ఆ పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నించి విఫలమైన పీకే..ఇప్పుడు నేరుగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకోవడం సంచలనం రేపుతోంది. అదీ తనకు బలమున్న బీహార్ నుంచే ఈ ప్రయోగం ప్రారంభించాలని నిర్ణయించడంతో అక్కడి బీజేపీ-జేడీయూ సర్కార్ పై పోరుతో రంగంలోకి దిగుతున్నట్లు అర్ధమవుతోంది.