ప్రియాంకా గాంధీపై తొలిసారి మోడీ డైరెక్ట్ అటాక్
అమేథీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీపై బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తొలిసారి ప్రత్యక్షంగా మాటల దాడికి దిగారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ లోకసభ స్థానంలో ప్రచారం చేస్తున్న ప్రియాంకపై నరేంద్ర మోడీ వాగ్బాణాలు విసిరారు. అమేథీలో ఆయన సోమవారం పార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీ కోసం ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెసు అహంకారాన్ని చూడండని, వారి నాయకుల్లో ఒకరు స్మృతి ఇరానీ ఎవరని అడిగారని ఆయన అన్నారు. అహంకారం పతాక స్థాయికి చేరుకుంటే ప్రజల నుంచి ప్రాథమిక మర్యాద కూడా కోల్పోతారని ఆయన అన్నారు. స్మృతి ఇరానీ ఎవరో వారికి తాను చెప్తానని, ఆమె తన చెల్లె అని, కాంగ్రెసు పాపాల నుంచి అమేథీ కాపాడడానికి ఇక్కడికి వచ్చిందని ఆయన అన్నారు
స్మృతి ఇరానీ గురించి మీడియా ప్రతినిధులు ఆదివారంనాడు అడిగినప్పుడు ఎవరు అని ప్రియాంకా గాంధీ అన్నారు. దాన్ని ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ వాగ్బాణాలు సంధించారు రాహుల్ భయ్యాకు సమస్యలు సృష్టించడానికి తాను స్మృతిని ఇక్కడికి పంపించలేదని, ఇప్పటికే రాహుల్ గాంధీ నిరాశతో ఉన్నారని, అమేథీ సమస్యలను తగ్గించడానికి తాను ఆమెను పంపించానని మోడీ అన్నారు.
ఇప్పటి వరకు నరేంద్ర మోడీ సోనియాను, రాహుల్ను మాత్రమే విమర్శిస్తూ వచ్చారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వద్రాకు వారు తోడ్పడుతున్నారని అన్నారు. అయితే, ప్రియాంక గాంధీని మాత్రం ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకోలేదు.