ఇళ్లను కాపాడుకునేందుకు ముస్లిం మతంలోకి 800మంది హిందువులు
లక్నో: తమ ఇళ్లను కాపాడుకునేందుకు 800మందికి పైగా వాల్మీకి కులానికి చెందిన హిందువులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్వాది పార్టీకి చెందిన మంత్రి అజాంఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాంపూర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అజాంఖాన్ కన్ను తమ ఇళ్లపై పడిందని, ఆయన షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు తమ కులానికి చెందిన వారు నివసిస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నారని స్థానిక వాల్మీకీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రసన్నం చేసుకోవాలంటే మతం మారక తప్పదని 800మంది వాల్మీకీలు నిర్ణయించుకున్నారు. దీంతో అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ముస్లిం పెద్దల సమక్షంలో మతం మార్చుకున్నారు.
అంతకుముందు వాల్మీకి కులస్తులు ఉంటున్న స్థలం ప్రభుత్వానిదని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతోపాటు గత వారం ఆ ఇళ్లకు రెడ్ మార్క్ వేశారు స్థానిక అధికారులు. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు.
ఇళ్లను కాపాడుకోవాలనుకుంటే మతం మార్చుకోవాలని కొందరు వారికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ముస్లిం మతం స్వీకరించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుపేదలను భయపెట్టి అజాంఖాన్ మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని పలువురు రాజకీయ నేతలు మండిపడ్డారు. కాన్పూర్లో అజాంఖాన్ దిష్టిబొమ్మను బిజెపి నేతలు దగ్ధం చేశారు.
కాగా, కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని అజాంఖాన్ సన్నిహితుడు ఒకరు తెలిపారు. తమ ఇళ్ల ధ్వంస ప్రతిపాదనకు నిరసనగా వాల్మీకీలు పారిశుధ్య కార్యక్రమాలను బుధవారం నుంచి నిలిపివేస్తామని ప్రకటించారు.