జనాభా, కరోనా తీవ్రతను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయింపులు.. వృథా చేస్తే కోతలే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ నూతన పాలసీని విడుదల చేసింది. కేంద్రం అందించే టీకా డోసులను.. జనాభా, కరోనా వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Recommended Video
జూన్ 21 నుంచి అమల్లోకి కేంద్రం కొత్త వ్యాక్సిన్ మార్గదర్శకాలు
జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై మంగళవారం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ సమర్థవంతంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. టీకా వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోత ఉండొచ్చని హెచ్చరించింది. టీకా లభ్యత సమాచారాన్ని కేంద్రానికి ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయాలని సూచించింది. ఈ నూతన మార్గదర్శకాలు జూన్ 21 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
75శాతం వ్యాక్సిన్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఫ్రీగా పంపిణీ
దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్రమే కొనుగోలు చేస్తుంది. ఈ టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత ఆధారంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తాయి. టీకా పంపిణీ ప్రాధాన్యతలో మొదటగా ఆరోగ్య సిబ్బంది, ఆ తర్వాత ఫ్రంట్లైన్ వర్కర్లు, 45ఏళ్లు పైబడిన ప్రజలు, రెండో డోసు వేయించుకోవాల్సిన వారు. ఇక చివరన 18ఏళ్లు పైబడినవారికి.
వ్యాక్సిన్లను వృథా చేస్తే ప్రతికూల ప్రభావం..
18 ఏళ్లు పైబడినవారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాతాలే సొంతంగా నిర్ణయించుకుని టీకా పంపిణీ షెడ్యూల్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే కరోనా వ్యాక్సిన్ డోసుల్లో రాష్ట్రాల్లోని జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్లో వృద్ధి వంటి అంశాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించడం జరుగుతుంది. రాష్ట్రాల్లోని టీకా వృథా.. కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. వ్యాక్సిన్ పంపిణీలో కోత విధించడం జరుగుతుందని స్పష్టం చేసింది.
కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. బుకింగ్..
వ్యాక్సిన్ డోసుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఆయా జిల్లాలు, వ్యాక్సిన్ కేంద్రాలకు ముందుగానే డోసుల వివరాలు పంపాలి. ప్రజలకు కూడా తెలియజేయాలి. కోవిన్ నమోదుతోపాటు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలి. కాల్ సెంటర్లు, కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా టీకా ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలని సూచించింది.
25శాతం వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రులకు.. రూ. 150 మాత్రమే ఛార్జీ
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 25 శాతం నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయించుకునే వీలు కల్పించడం జరిగింది. ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే డోసుల ధరలను తయారీదారులు ముందుగానే ప్రకటించాలి. టీకాలపై ఛార్జీలను కూడా వెల్లడించాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరపై సేవా రుసు గరిష్టంగా రూ. 150 మాత్రమే తీసుకోవాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తనిఖీలు జరపాలని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం వెల్లడించింది.