పెళ్లిపీటల నుంచి వరుడు పరార్: అదే టైంలో !
కొద్ది సేపటిలో పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టాల్సిన సమయంలో వరుడు మాయం అయిన సంఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని నంజనగూడులో జరిగింది.
బెంగళూరు: కొద్ది సేపటిలో పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టాల్సిన సమయంలో వరుడు మాయం అయిన సంఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని నంజనగూడులో జరిగింది. అయితే పెళ్లి అనుకున్న ముహూర్తానికి వేరే వ్యక్తితో జరగడంతో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
పెళ్లిపీటల నుంచి మాయం అయిన పెళ్లి కుమారుడు ఉమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నంజనగూడు తాలుకా తొండేవాడి గ్రామానికి చెందిన పిణ్యా నాయక్, మహదేవమ్మ దంపతుల కుమారుడు ఉమేష్ బెంగళూరులో ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
చిక్కమగళూరు తాలుకా నందికెరె కు చెందిన రాధ అనే యువతి అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఉమేష్, రాధకు పరిచయం అయ్యింది. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.
2012లో పెద్దలకు తెలియకుండా ఉమేష్, రాధ ఇద్దరూ బెంగళూరులో రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఉమేష్, రాధ దంపతులకు మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. రెండు నెలల క్రితం ఉమేష్ తల్లి మహదేవమ్మ తన తమ్ముడు మహదేవ నాయక్ కుమార్తె స్వాతిని కోడలు చేసుకోవాలని నిర్ణయించింది.
ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. ఆ టైంలో ఉమేష్ తనకు పెళ్లి జరిగిందని కానీ, లేదా తనకు ఇష్టం లేదని కాని పెద్దలకు చెప్పలేదు. నవంబర్ 22వ తేది ఇరు కుటుంబ సభ్యులు నంజనగూడులోని కల్యాణ మండపం చేరుకున్నారు.
హిందూ సాంప్రధాయం ప్రకారం వధూవరులకు నలుగులు పెట్టారు. బుధవారం ఉదయం మూహుర్తానికి అన్నీ సిద్దం చేస్తున్నారు. అంతే కల్యాణమండపం నుంచి వరుడు ఉమేష్ మాయం అయ్యాడు. అతని కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో సొంత మేన మామ ( పెళ్లి కుమార్తె తండ్రి) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తరువాత పెళ్లి ఆగిపోరాదని పెద్దలు ఆలోచించారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న బాబు అనే యువకుడు అదే పెళ్లికి హాజరైనాడు. అతనితో రాధ పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ముందుగా అనుకున్న ముహూర్తానికి రాధ, బాబులకు పెళ్లి చేశారు. పెళ్లిపీటల నుంచి మాయం అయిన ఉమేష్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.