ఆ నాడు ఇచ్చింది వైఎస్ఆర్ కాదా.. అమరరాజా వ్యవహారంపై రఘురామ..
అమరరాజా బ్యాటరీస్ చుట్టూ ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. చెన్నైకి తరలింపు అనే ఊహాగానాల నేపథ్యంలో.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా స్పందించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోవడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రియాక్ట్ అయ్యారు.
గతంలో అమరరాజా కంపెనీకి భూములు కేటాయించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని గుర్తుచేశారు. అప్పుడు లేని తప్పులు ఇప్పుడు కనిపించాయా? అని ప్రశ్నించారు. అమరరాజా కంపెనీ తరలిపోవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెరొ మాట చెబుతున్నారని అన్నారు. సజ్జల తీరు అడ్డు అదుపు లేకుండా ఉందని, రాష్ట్రంలోని అన్ని శాఖల గురించి సజ్జలే మాట్లాడతారా? అని నిలదీశారు.
పార్లమెంటు వద్ద తనను బెదిరించిన గోరంట్ల మాధవ్ను వైసీపీ నేతలు అభినందించినట్టు తెలిసిందని రఘురామ చెప్పారు. 'మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే చంపేస్తారా? మీ ఉడుత ఊపులు నా వద్ద కాదు... నేను చేస్తోంది ధర్మపోరాటం' అని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపైనా రఘురామ తన మనోభావాలను పంచుకున్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే తాను కూడా ఎంపీ పదవీని వదులకునేందుకు సిద్ధమని ప్రకటించారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు అందరూ రాజీనామాలు చేయడంతోపాటు, సీఎం జగన్ కూడా ఢిల్లీ వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.