పోటాపోటీ: మోడీతో ఐదుగురు మహిళల ఢీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏక వ్యక్తి కేంద్రంగా ప్రచారం చేస్తోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసందే.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కాకుండా చేసేందుకు విపక్షాలు ఆయన మీద ఎదురుదాడికి దిగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐదుగురు మహిళా ముఖ్య నేతలు ఆయనను టార్గెట్ చేసుకున్నారు. అందులో కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీ, ఆయన తనయు ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిఎస్పీ అధినేత్రి మాయావతిలు ఉన్నారు. అయితే మోడీ వారికి ధీటుగానే సమాధానం చెబుతున్నారు.
ప్రియాంక గాంధీ
ఎన్నికల నేపథ్యంలో మోడీ పైన ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శల్లో భాగంగా ఆమె ఇటీవల... దేశాన్ని నడిపేందుకు 56 ఇంచెస్ చెస్ట్ ఉండాల్సిన అవసరం లేదని మోడీని ఉద్దేశించి అన్నారు. మనది ప్రజాస్వామ్యం అని, వ్యక్తిస్వామ్యం అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
సోనియా గాంధీ
గుజరాత్ మోడల్ నుండి దేశాన్ని కాపాడాలని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. దేశాన్ని గుజరాత్ మోడల్ చేస్తానని మోడీ చెబుతున్నారని కానీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అని ఆమె ప్రశ్నించారు.
మమతా బెనర్జీ
తన హయాంలో గుజరాత్ అభివృద్ధి చెందిందని మోడీ చెబుతున్నారని కానీ, ఆయన హయాంలో వృద్ధి రేటు తగ్గిందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. గుజరాత్ కేవలం మోడీ నాయకత్వంలోనే అభివృద్ధఇ చెందలేదని చెప్పారు. రెండు రోజులుగా బిజెపి, టిఎంసి మధ్య చిత్రపటం వివాదం కొనసాగుతోంది.
జయలలిత
జయలలిత గత పదిరోజులుగా మోడీ పైన నిప్పులు చెరుగుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో మోడీ భేటీ తర్వాత ఆమె టార్గెట్ చేశారు. ఓ సమయంలో జయ ఎన్డీయేలోనే ఉంటారని, మోడీతో ఆమెకు మంచి మిత్రుత్వం ఉందని భావించారు. కానీ ఇటీవల ఆమె మోడీ పైన విరుచుకు పడుతున్నారు. గుజరాత్ కంటే తమిళనాడుయే అన్నింటి అభివృద్ధిలో ముందుందని చెప్పారు.
మాయావతి
గుజరాత్ అల్లర్లకు మోడీయే బాధ్యుడని మాయావతి ఆరోపిస్తున్నారు. మోడీ ప్రధాని అయితే కమ్యూనల్ అల్లర్లకు అవకాశముందని ఆమె హెచ్చరిస్తున్నారు. దళిత బిడ్డను ప్రధానిని చేద్దామనుకుంటే బిఎస్పీకి ఓటేయాలని, మతతత్వ బిజెపిని, అవినీతి కాంగ్రెసు పార్టీని దూరంగా పెట్టాలని చెబుతున్నారు. కాగా, గతంలో పశ్చిమ బెంగాల్ వెళ్లినప్పుడు మోడీ.. మమత పైన ప్రశంసలు కురిపించారు. కానీ, బిజెపి, తృణమూల్లు కలిసే పరిస్థితి కనిపించకపోవడంతో పరస్పరం మాటల బాణాల విసురుకుంటున్నారు. ఇక జయలలిత కూడా ఎన్డీయోలోకి వచ్చే అవకాశముందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె కూడా టార్గెట్ చేశారు. వీరికి మోడీ ధీటుగా సమాధానం చెబుతున్నారు.త