కమ్ముకొస్తోన్న యుద్ధ మేఘాలు: సరిహద్దులకు భారీగా భారత సైన్యం: హెవీ యుద్ధ ట్యాంకులతో చైనా
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చినట్టు కనిపిస్తున్నాయి. యుద్ధానికి దారితీసేలా మారుతున్నాయి. భారత్-చైనా సరిహద్దు వెంబడి క్రమంగా యుద్ధ మేఘాలు అలుముకొంటున్నాయి. ప్రస్తుతం లఢక్ సమీపంలోని వాస్తవాధీనరేఖ వెంబడి ఉన్న పంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరింపజేసిన భారత్.. ఇక తాజాగా హిమాచల్ ప్రదేశ్ వైపు దృష్టి సారించింది. హిమాచల్ ప్రదేశ్లో చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రాంతాలకు పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలిస్తోంది.
Recommended Video
సరిహద్దులకు భారత జవాన్లు..
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి సరిహద్దులకు తరలి వెళ్తోన్న జవాన్లకు స్థానికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రత్యేకించి- చైనా అంటే ఒంటికాలిపై లేచే టిబెటన్లు.. భారత జవాన్లకు చీఫ్ అప్ చేస్తున్నారు. ఒక్క హిమాచల్ ప్రదేశ్ వైపే కాకుండా.. సుమారు మూడు వేల కిలోమీటర్లకు పైగా ఉన్న చైనా సరిహద్దుల వెంబడి భద్రతా వ్యవస్థను కేంద్రం కట్టుదిట్టం చేస్తోంది. ఇంతకుముందెప్పుడూ లేని సంఖ్యలో జవాన్లను మోహరింపజేస్తోంది. ఎలాంటి పరిస్థితులపైనా ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోంది.
యుద్ధ ట్యాంకులతో చైనా..
మరోవంక- చైనా కూడా తీసిపోవట్లేదు. పంగ్యాంగ్ త్సొ సరస్సు సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి తన బలగాల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. ఇప్పుడున్న సైనికులకు అదనంగా మరింత మందిని తరలిస్తోంది. అక్కడితో ఆగట్లేదు డ్రాగన్ కంట్రీ. యుద్ధ సామాగ్రినీ చేరవేస్తోంది. భారీ యుద్ధ ట్యాంకులను తరలిస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడిస్తోంది. ఆర్మీ అధికార వర్గాలను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. ఈ పరిణామాలన్నీ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదివరకే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా.
భారత జెండా ఎగరేయడంతో..
కిందటి నెల 29, 30 తేదీల్లో పంగ్యాంగ్ త్సొ లేక్ దక్షిణ ప్రాంతంలో భారత, చైనా మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత.. భారత జవాన్లు దూకుడుగా వ్యవహరించారు. లఢక్ ఈశాన్య ప్రాంతంలో కొన్ని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రెండు దేశాలకూ వ్యూహాత్మకంగా, భౌగోళికంగా కీలకంగా మారిన ఆ ప్రాంతాలను భారత సైనికులు స్వాధీనం చేసుకోవడాన్ని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తీవ్రంగా పరిగణించిందని చెబుతున్నారు.
థాకుంగ్,ముక్పారి హైట్స్..
భారత జవాన్లు స్వాధీనం చేసుకున్న థాకుంగ్, ముక్పారి హైట్స్ను ఖాళీ చేయించేలా భారత్పై ఒత్తిడిని తీసుకుని రావడంలో భాగంగా యుద్ధానికి సన్నద్ధమౌతోందని అంటున్నారు. దీనికోసం వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఉండే స్పాంగుర్ గ్యాప్ సమీపం వరకూ తన భూభాగంపైకి చైనా యుద్ధ ట్యాంకులను తరలించినట్లు జాతీయ మీడియా వెల్లడిస్తోంది. చైనా తన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, రాకెట్స్, ఇతర యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తోందనే విషయాన్ని భారత ఆర్మీ అధికారులు ధృవీకరించినట్లు చెబుతోంది. ఈ పరిస్థితుల్లో భారత సైన్యం కూడా టీ-90 హెవీ వార్ ట్యాంకులు, టీ-72ఎం1 ట్యాంకులను లఢక్ ఈశాన్య ప్రాంతానికి తరలించడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో..
లఢక్ సమీపంలోని వాస్తవాధీనరేఖ వద్ద పరిస్థితులు అత్యంత సున్నితంగా, సమస్యాత్మకంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె చేసిన వ్యాఖ్యలు కూడా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనడానికి సైన్యం సమాయాత్తమై ఉందని చెప్పారు. శతృవుల నుంచి ఎదురయ్యే సవాళ్లను తిప్పి కొట్టగలమని అన్నారు. సరిహద్దు భద్రతా బలగాలు అనుక్షణం అప్రమత్తతో ఉంటున్నాయని, ఆ అప్రమత్తే.. చైనా సైనికుల చొరబాటు యత్నాలను తిప్పి కొట్టడానికి సహాయపడిందని నరవణె పేర్కొన్నారు. కఠిన వాతావరణంలోనూ క్రమశిక్షణతో మెలుగుతున్నారని ఆయన ప్రశంసించారు.