నా పడవ మునగదు: మాంఝీ, సంక్షోభంపై ప్రధానికి, రేపు నితీష్ ప్రమాణం!
పాట్నా: తన పడవ ఎన్నటికీ మునగదని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఆదివారం అన్నారు. ఆయన ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన మోడీని కలుస్తారు. బీహార్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం పైన మాఝీ ప్రధానితో చర్చిస్తారు.
ఢిల్లీకి వచ్చిన ఆయనను రాజకీయ భవితపై విలేకరులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాంఝీ పడవ మునగబోదన్నారు. ఆయన ప్రధాని మోడీ నేతృత్వంలోని నీతి అయోగ్ సమావేశానికి హాజరయ్యారు. దీనిని జేడీయు సమ్మతించడం లేదు.
మరోవైపు, జేడీయు ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిశారు. తమ కొత్త నేతగా నితీష్ కుమార్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నితీష్కు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూడా మద్దతు పలుకుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్లో సంక్షోభానికి బీజేపీయే కారణమని ఆరోపించారు. సభాపతి నితీష్ కుమార్ను శాసన సభా పక్ష నేతగా గుర్తించారు. నితీష్ రేపు ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని నిశితంగా పరీక్షిస్తున్న బీజేపీ వ్యూహాలా రచిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర నేతలతో శనివారం సమావేశమయ్యారు. సంక్షోభం నేపథ్యంలో బీహార్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ బీహార్ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ అన్నారు. బీహార్ పరిస్థితిపై ప్రధాని మోడీ కూడా అగ్రనేతలతో చర్చించారు.