కరోనా కలకలం: కేవలం 12 రోజుల్లోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు, కేంద్రం ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ రెండో దశలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తిస్తుండటంతో పాజిటివ్ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. కేవలం 12 రోజుల్లోనే ఇది రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనావైరస్ పాజిటివిటీ రేటు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.
ఏప్రిల్ 6న 8 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 16.69 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 12 రోజుల్లోనే రెట్టింపు అయినట్లు పేర్కొంది. ఇక గత నెలలో 3.05 శాతం ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 13.54 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వారం రోజుల్లో పాజిటివిటీ రేటు అత్యధికంగా ఛత్తీస్గఢ్లో 30.38 శాతం నమోదు కాగా, గోవా 24.24శాతం, మహారాష్ట్ర 24.17శాతం, రాజస్థాన్ 23.33శాతం, మధ్యప్రదేశ్ 18.99 శాతంతో అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 25వేలు నమోదు కావడం గమనార్హం. దీంతో అక్కడ కూడా పాజిటివిటీ రేటు 30 శాతానికి చేరుకుంది.
కాగా, గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 2.61 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1501 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా కొత్త నమోదవుతున్న కరోనా కేసులు ఎక్కువగా పది రాష్ట్రాల్లోనే ఉంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 78.56 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18 లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నట్లు వెల్లడించింది.