షాక్: 1.16 లక్షల మందికి ఐటీ నోటీసులు, రూ.25లక్షలకు పైగా డిపాజిట్లు
పెద్ద నోట్ల రద్దు తర్వాత అత్యధిక మొత్తంలో బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసి పన్ను రిటర్నులు దాఖలు చేయని వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేస్తోంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత అత్యధిక మొత్తంలో బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసి పన్ను రిటర్నులు దాఖలు చేయని వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేస్తోంది. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసిన 1.16 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.
గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంతో ఆ సమయంలో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు.
బ్లాక్ మనీని అరికట్టేందుకు పెద్ద నగదు నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే పెద్ద నగదు నోట్ల రద్దు వల్ల దేశానికి ఆశించిన ప్రయోజనం జరగలేదని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
1.16 లక్షల మంది ఐటీ నోటీసులు
పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.తాజాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.25 లక్షల కంటే ఎక్కువగా మొత్తంలో డిపాజిట్ చేసి, గడువు నాటికి పన్ను రిటర్నులు దాఖలు చేయని 1.16 లక్షల మంది వ్యక్తులకు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు పంపింది.
రెండు కేటగిరిలుగా విభజన
ఐటీ రిటర్నులు దాఖలు చేసి పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన వారిపై కూడా ఐటీ శాఖ దృష్టిపెట్టింది. ఈ విషయాన్ని సీబీడీటీ చైర్మన్ సుశిల్ చంద్ర తెలిపారు. అంతేకాక ఐటీ రిటర్నులు దాఖలు చేయని సంస్థలను, వ్యక్తులను రెండు కేటగిరీలుగా విభజించింది. ఈ మేరకు నోటీసులు పంపినట్టు ఐటీ శాఖ ప్రకటించింది.
30 రోజుల్లో ఐటీ రిటర్న్స్ దాఖలు
1.16 లక్షల మంది పాత కరెన్సీ నోట్లలో రూ.25 లక్షలకు పైగా మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. కానీ వీరు ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదని, 30 రోజుల వ్యవధిలో వీరిని ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశించినట్టు సుశిల్ చంద్ర తెలిపారు.
రెండో దశలో కూడ నోటీసులు
రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్యలో 2.4 లక్షల మంది డిపాజిట్ చేశారని, కానీ వీరు కూడా రిటర్నులు దాఖలు చేయలేదని ఐటీ శాఖాధికారులు ప్రకటించారు. వీరికీ రెండో దశలో నోటీసులు పంపనున్నట్టు చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 142(1) కింద నోటీసులు జారీ అయ్యాయని అధికారులు ప్రకటించారు.