మోడీ, పళని ప్లాన్: రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే ఐటీ దాడులు, జైలు కొత్తకాదు, దినకరన్!
చెన్నై: మా కుటుంబాన్ని అణగదొక్కేందుకు 33 ఏళ్ల నుంచి పయత్నాలు సాగుతూనే ఉన్నాయని, వాటన్నింటిని ఎదుర్కొన్నామని, మోడీ, పళనిసామి ప్లాన్ తో ఇప్పుడు జరుగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులను ఎదుర్కొలేమా, మేము దేనికైనా రెడీగానే ఉన్నామని, నాకు జైలు కొత్తకాదని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ అన్నారు.
Recommended Video

శశికళ, తాను రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే ప్లాన్ తోనే ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడే ప్రసక్తే లేదని టీటీవీ దినకరన్ చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదాయపన్ను శాఖ అధికారులను రెచ్చగొట్టి మా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేయించారని టీటీవీ దినకరన్ ఆరోపణలు చేశారు.

అమ్మకు భద్రతా కవచం
అమ్మ జయలలితకు భద్రతా కవచంగా ఉన్న కుటుంబం మాది, 33 ఏళ్లుగా మా కుటుంబాన్ని రాజకీయాల్లో లేకుండా చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, మమ్మల్ని అణగదొక్కే ప్రయాత్నాలు జరిగినా వాటిని తిప్పికొడుతూ ఇంత వరకు వచ్చామని టీటీవీ దినకరన్ చెప్పారు.

అమ్మకు వ్యతిరేకంగా సాక్షం !
గతంలో తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారని, అమ్మ జయలలితకు వ్యతిరేకంగా సాక్షం చెప్పాలని ఒత్తిడి చేశారని, అప్పుడే తాను భయపడలేదని, ఇప్పుడు ఎలా భయపడతామని టీటీవీ దినకరన్ అన్నారు. కేసులు నమోదు కావడం, జైలుకు వెళ్లడం మాకు కొత్తకాదు, మమ్మల్ని ఏమీ చెయ్యలేరని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.

30 ఏళ్లలోనే జైలు చూశా
తనకు 30 ఏళ్ల వయసు ఉన్న సమయంలో కేసు నమోదు చేసి జైలుకు పంపించారని, ఇప్పుడు తన వయసు 55 ఏళ్లని టీటీవీ దినకరన్ గుర్తు చేశారు. ఇప్పుడు తనను అరెస్టు చేసి 20 ఏళ్లు జైల్లో పెట్టినా 75 ఏళ్ల వయసులో బయటకు వచ్చి అన్నాడీఎంకే పార్టీని రక్షించుకుంటానని టీటీవీ దినకరన్ చాలెంజ్ చేశారు.

మోడీ ప్రభుత్వానికి సవాల్
తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం అన్నాడీఎంకే పార్టీని మోడీ ప్రభుత్వం దగ్గర తాకట్టుపెట్టేశారని టీటీవీ దినకరన్ మండిపడ్డారు. శశికళ, తనను రాజకీయాల్లో లేకుండా చెయ్యాలని మోడీ, ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని టీటీవీ దినకరన్ ఆరోపించారు.

అధికారులే నకిలి పత్రాలు పెడితే !
తన ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని పని వాళ్లు చెప్పారని వెళ్లి చూస్తే ఎలాంటి సోదాలు జరగలేదని దినకరన్ అన్నారు. ఫాంహోస్ లో మాత్రం ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారని, అధికారులే మాకు తెలీకుండా నకిలి పత్రాలు పెడుతారనే భయంతో అక్కడికి న్యాయవాదిని పంపించామని టీటీవీ దినకరన్ చెప్పారు.












Click it and Unblock the Notifications