పెగాసస్ దర్యాప్తు అక్కడి నుంచే-సుప్రీం ఆదేశాలతో నిపుణుల కమిటీ అడుగులు-కేంద్రానికి మరో షాక్
పెగాసస్ స్పైవేర్ వాడకం ద్వారా భారత్ లో విపక్ష రాజకీయనేతలు, సొంత ప్రభుత్వంలోని మంత్రులు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని ఆరోపణల్ని ఎదుర్కొంటున్న కేంద్రానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది పెగాసస్ వివాదంపై స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలో కూడా స్పష్టం చేసింది. దీంతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన చర్యలన్నీ ఇందులో భాగం కానున్నాయి. ఇందులో ఏ ఒక్క అంశంలో దొరికినా కేంద్రం విమర్శల పాలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
పెగాసస్ నిఘా వివాదం
ఇజ్రాయెల్ కు చెందిన స్పైవేర్ సంస్ధ పెగాసస్ తయారు చేసిన సాఫ్ట్ వేర్ తో దేశంలోని వీఐపీలు, కేంద్రంలోని మంత్రులు, విపక్ష నేతలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు తాజాగా గుప్పుమన్నాయి. దీంతో కేంద్రం ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలకు దిగాయి. ఈ వివాదం కాస్తా చినికి చినికి గాలి వానగా మారి సుప్రీంకోర్టుకు చేరింది.. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. విపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో అసలు పెగాసస్ స్పైవేర్ ను వారిపై ప్రయోగించారా లేదా అని సుప్రీం అడిగిన ప్రశ్నకు కేంద్రం నేరుగా సమాధానం ఇవ్వలేదు. దీంతో వివాదం ముదిరింది.
తడబడి ఇరుకున పడ్డ కేంద్రం
ఇజ్రాయెల్ నుంచి కొనుక్కున్న పెగాసస్ స్పైవేర్ ను దేశంలోని విపక్ష నేతలు, సొంత ప్రభుత్వంలో మంత్రులు, జర్నలిస్టులపై ప్రయోగించినట్లు వస్తున్న ఆరోపణలపై కేంద్రం సుప్రీంకోర్టుకు సంతృప్తికర వివరణ ఇవ్వలేకపోయింది. దీంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. సుప్రీంకోర్టు నేరుగా స్పందించాలని కోరుతున్నా పూర్తిస్ఝాయిలో అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రం సిద్ధం కాలేదు. డొంకతిరుగుడు సమాధానాలతో తప్పించుకోవాలని చూసింది. ఇందులో తామే స్వతంత్ర నిపుణుల కమిటీతో దర్యాప్తు చేయిస్తామని చెప్పడం కూడా ఉంది. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీం తీర్పుతో భారీ షాక్
పెగాసస్ స్పైవేర్ వాడిన వ్యవహారంపై సుప్రీంకోర్టు నిన్న స్వతంత్ర నిపుణుల కమిటీని నియమిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. అంతే కాదు కేంద్రం పెగాసస్ వాడలేదని స్పష్టంగా చెప్పకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా సుప్రీం ధర్మాసనం తెలిపింది. దీంతో పెగాసస్ ను కేంద్రం వాడిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఇవి కేంద్రాన్ని మరింత ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఇవన్నీ యథాతథంగా అమలైతే రాబోయే రోజుల్లో కేంద్రానికి చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
2019 నుంచీ దర్యాప్తుకు కమిటీ రెడీ
పెగాసస్ స్పైవేర్ వాడకం వివాదం తాజాగా మొదలైంది. అయితే దీనిపై కేంద్రం సరిగ్గా స్పందించకపోవడంతో అనుమానాలు పెరిగి సుప్రీంకోర్టు దర్యాప్తుకు స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించే వరకూ వెళ్లింది. అయినా కేంద్రం తీరు అనుమానాస్పదంగానే ఉంది. దీంతో సుప్రీంకోర్టు నిపుణుల కమిటీకి పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాజాగా తలెత్తిన వివాదంతో పాటు 2019 లో జరిగిన సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్ నుంచి ఈ దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేంద్రం మరింత ఇరుకునపడింది. ఎందుకంటే 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. అప్పట్లో సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయడం ద్వారా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పడు సుప్రీంకోర్టు తన తీర్పులో పాత వివాదాల్ని కూడా కెలకడంతో మోడీ సర్కార్ మరింత ఇరుకునపడుతోంది.
Recommended Video
మోడీ సర్కార్ కు భారీ షాకులు ?
2014 నుంచీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్.. ఈ ఏడేళ్లలో తనపై వచ్చిన ఏ ఆరోపణకూ సక్రమంగా సమాధానం ఇచ్చింది లేదు. విపక్షాలు ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం, వారి హయాంలో జరిగిన తప్పిదాల్ని తెరపైకి తీసుకురావడంతో సరిపెట్టింది అదే సమయంలో రైతుల నిరసనలపై సైతం మద్దతిచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ కేసులు పెట్టించింది. ముఖ్యంగా సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు ఐటీ నిబంధనల్ని మార్చేసింది. వాటిని అమలు చేసేందుకు నిరాకరించిన సోషల్ మీడియా దిగ్గజాల్ని టార్గెట్ చేసింది. కానీ ఇప్పుడు పెగాసస్ స్పైవేర్ వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మోడీ సర్కార్ కు భారీ షాకులు తప్పడం లేదు. ముఖ్యంగా 2019 నుంచి జరిగిన ఘటనల్ని సుప్రీంకోర్టు కమిటీ దర్యాప్తు చేస్తే అప్పుడు మోడీ సర్కార్ కు మరిన్ని సమస్యలు తప్పవన్న చర్చ జరుగుతోంది.