ఉక్రెయిన్ పై భారత్ మరోసారి క్లారిటీ - ఐక్యరాజ్య సమితి వేదికగా : తక్షణం ఇలా చేయాల్సిందే..!!
రష్యా - ఉక్రెయిన్ యుద్దం విషయంలో భారత్ తన వైఖరి స్పష్టం చేసింది. రష్యాకు మద్దతుగా భారత్ వ్యవహరిస్తోందనే వాదన నడుమ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ మానవతా సంక్షోభం పైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ప్రతిపాదిన తీర్మానానికి దూరంగా ఉండి భారత్ తన విధానం ఏంటనే అంశం పైన క్లారిటీ ఇచ్చింది. ఇది ఒక రకంగా రష్యాకు మింగుడపడని విషయం. చైనా ఒక వైపు రష్యాకు మద్దతుగా నిలిచినా.. భారత్ మాత్రం తన వైఖరికే కట్టుబడి ఉంది.
వైఖరి స్పష్టం చేసిన భారత్
ఇదే సమయంలో మరోసారి ఉక్రెయిన్లో మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. అటు రష్యా - ఇటు ఉక్రెయిన్ రెండు దేశాల యుద్ద నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరికే కట్టుబడి ఉన్న విషయాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా తేల్చి చెప్పింది. ఈ తీర్మానం పైన జరిగిన ఓటింగ్ కు దూరం కావటం ద్వారా రష్యా - ఉక్రెయిన్ కు సమాన దూరం పాటిస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 దేశాలు ఉండగా.. 140 దేశాలు తాజా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. యుద్ధం విరమణ, మానవతా సంక్షోభాన్ని అడ్డుకోవడం తదితర చర్యలు చేపట్టడంపై దృష్టి సారించాలని ఉక్రెయిన్ తీర్మానంలో పేర్కొంది.
తమ పాత్రపై యూఎన్ఓ వేదికగా క్లారిటీ
ఈ సమావేశానికి 38 దేశాలు దూరంగా ఉన్నాయి. అయిదు దేశాలు ఉక్రెయిన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ తన విధానం..వైఖరి..ఏం కోరుకుంటుందనే అంశం పైన క్లారిటీ ఇచ్చింది.చర్చల ద్వారానే సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లుగా భారత్ స్పష్టం చేసింది. సామరస్యంగా యుద్దం ముగించటానికి..అదే సమమంలో తక్షణ మానవతా సాయంపై ఐక్యరాజ్య సమితి దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని భారత్ తేల్చి చెప్పింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో పరిస్థితులు.. వేగంగా క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలు, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కిచెప్పింది. ఉక్రెయిన్లో తక్షణం కాల్పులు విరమణ చేపట్టాలని పునరుద్ఘాటించింది.
భారత్ కోరుకుంటుంది ఇదే
ముసాయిదా తీర్మానం వీటిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదని భారత్ పేర్కొంది. కొద్ది రోజుల క్రితం రష్యాకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలు ప్రతిపాదించిన తీర్మానాల విషయంలోనూ భారత్ తటస్థ వైఖరినే ప్రదర్శించింది. ఓటింగ్ కు దూరంగా ఉంటూ వచ్చింది. ఒక రోజు ముందు రష్యా ప్రతిపాదించిన తీర్మానానికి దూరంగా ఉండగా, ఇప్పుడు ఉక్రెయిన్ తీర్మానానికి భారత్ దూరంగా ఉంటూ సమ దూరం పాటిస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. భాస్వరంతో తయారు చేసిన బాంబులను రష్యా తమపై ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. సైనిక పరంగా నాటో సాయం అందించాలని అభ్యర్థించారు. ఇక, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రెజిల్ పర్యటనతో ఉన్నారు. నాటో దేశాల కార్యాచరణ పైన మంతనాలు చేస్తున్నట్లుగా సమాచారం.