పాక్ మంత్రికి బిగ్ షాక్- భారత్పై అవాకులు చెవాకులు పేలిన ఫలితం?
Pahalgam Terror attack: పహల్గామ్లో ఉగ్రవాదుల ఘాతుకం తరువాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోతోంది. భారత్పై బురదజల్లే ప్రయత్నాలకు తెర తీసింది. ఎదురుదాడికి దిగుతోంది. అంతర్జాతీయ వేదికలపైనా భారత్ను బద్నాం చేయడానికి శతవిధాలా శ్రమిస్తోంది గానీ అవేవీ ఫలించట్లేదు.
దీనితో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరింత రెచ్చిపోయారు. తన కడుపుమంటను బయటపెట్టుకున్నారు. భారతే స్వయంగా ఉగ్రవాదాన్ని పోషిస్తోందంటూ బట్ట కాల్చి ముఖం వేశారు. ఒకదశలో చొరబాట్లనూ సమర్థించుకున్నారాయన. సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తమ బలగాలను బలోపేతం చేశామని, కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోదలచుకున్నామని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. తమపై భారత్ దాడికి పాల్పడే అవకాశం ఉన్నందున ఆ దేశాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చొరబాటు ఆసన్నమైందని తాను ఎందుకు భావిస్తున్నానో మరిన్ని వివరాలలోకి వెళ్లలేదని ఆయన అన్నారు.
పహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు ఇద్దరు పాకిస్తాన్కు చెందినవారని భారత్ చెప్పడాన్ని ఖవాజా తప్పు పట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్ ఇలాంటి ప్రకటనలను చేయడం సరికాదని అన్నారు. దీన్ని తమ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని, తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చిన విషయాన్ని ఆసిఫ్ గుర్తు చేశారు.
భారత్ ప్రదర్శిస్తోన్న దూకుడు పట్ల తాము అత్యంత అప్రమత్తంగా ఉన్నామని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడినప్పుడు అణ్వాయుధాలను ఉపయోగిస్తామని ఆసిఫ్ తేల్చి చెప్పారు. మానసికంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఓ యుద్ధం ఎదురుకాబోతోందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను ఆ తరువాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. యుద్ధం జరిగే అవకాశాల గురించి ఛానల్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు వచ్చే రెండు మూడు రోజులు చాలా కీలకమని మాత్రమే తాను చెప్పానని అన్నారు.
ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. అటు ఐక్యరాజ్యసమితిలోనూ దీన్ని ప్రస్తావించింది. దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చుతున్నట్లు, వాటికి మద్దతు ఇస్తోన్నట్లు పాకిస్తాన్ ఒప్పుకున్నట్టయిందని తెలిపింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోన్నామనే విషయాన్ని పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని వ్యాఖ్యానించింది.
అదే సమయంలో ఖవాజా ఆసిఫ్ ఎక్స్ అకౌంట్ను భారత్లో నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆసిఫ్ భారత్పై దుష్ప్రచారం చేస్తోన్నారని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోన్నారని, అందుకే ఎక్స్ అకౌంట్ను బ్యాన్ చేసినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications