త్యాగాలు చేయాల్సింది ప్రజలు మాత్రమే కాదు: ప్రధాని మోదీకి కమల్ రిక్వెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్నాయి. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని మోదీ సూచించారు. బంగారాన్ని కొనకుండా ఉండాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతులను అవలంబించాలని, దేశీయ లేదా అంతర్జాతీయ అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్ తో పాటు చివరికి వంటనూనె వినియోగాన్ని సైతం తగ్గించుకోవాలని సూచించారు.
దీనిపై తాజాగా మక్కల్ నీథి మయ్యం చీఫ్, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ స్పందించారు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం భారత్పై పడుతున్న తరుణంలో ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. గతంలో యుద్ధాలు, కొరతలు, సంక్షోభ పరిస్థితులను దేశం మొత్తం కూడా ఐక్యత, త్యాగాలతో అధిగమించిందని, ఇప్పుడు కూడా అదే జాతీయ స్ఫూర్తి అవసరమని పిలుపునిచ్చారు. ఇరాన్ యుద్ధ ప్రభావం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్న ఓ భారతీయుడిగా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలు ఇంధన పొదుపు నిబంధనలు విధించాయని, సింగపూర్ ప్రధాని ప్రజలను కఠిన పరిస్థితులకు సిద్ధమవ్వాలని కోరారని కమల్ హాసన్ గుర్తుచేశారు. దేశంలో కూడా గడ్డు పరిస్థితులు తలెత్తాయని, ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలని ప్రధాని మోదీ సూచించారని అన్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజలందరూ కూడా బాధ్యత మెలగాల్సిన అవసరం ఉందని, వారిలో బాధ్యత మరింత పెరిగిందని పునరుద్ఘాటించారు.
"ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ దేశం నిలిచి ఉంటుంది.." అని గతంలో అట్ బిహారీ వాజ్పేయి చేసిన వ్యాఖ్యలను తన వీడియోలో ప్రస్తావించారు కమల్ హాసన్. దేశంలో గత దశాబ్దంలో సౌర, పవన శక్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. పునరుత్పాదక ఇంధనాలు, అణుశక్తి రంగాలలో ఇటీవల జరిగిన పెట్టుబడులు విదేశీ చమురు, గ్యాస్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రోత్సాహకరమైన చర్యలని పేర్కొన్నారు.
త్యాగాలు కేవలం ప్రజల నుండి మాత్రమే ఆశించరాదని, ప్రభుత్వాలు కూడా ఈ భారాన్ని పంచుకోవాలని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సామాన్య ప్రజలను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
India has overcome wars, shortages, and global crises before - through unity and shared sacrifice. This moment calls for the same national spirit again. 🇮🇳 pic.twitter.com/Mi56m0I4pD
— Kamal Haasan (@ikamalhaasan) May 22, 2026
రాష్ట్రాలన్నీ కూడా పెట్రోల్, డీజిల్పై విధించే వ్యాట్ వంటి పన్నులను తగ్గించాలని కమల్ హాసన్ పేర్కొన్నారు. రైలు, మెట్రో, బస్సు ఛార్జీలను తగ్గించాలని, దీని ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వైపు మళ్లుతారని, అలా వారిని ప్రోత్సహించాలని చెప్పారు. ఈ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటే, దేశం మరింత బలంగా ఆవిర్భవిస్తుందని కమల్ హాసన్ విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications