సీబీఐ లేకపోతే మేము లేము: ప్రధాని మోదీ క్లారిటీ
న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు తీవ్రతరం అవుతూ వస్తోన్నాయి. అనేక కీలక కేసులను ఈ రెండు సంస్థలు విచారిస్తోన్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సహా ఏపీ, తెలంగాణకు చెందిన పలు సంచలన కేసులపై దృష్టి సారించాయి ఈ రెండు సంస్థలు కూడా. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను.. వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాలపై మాత్రమే వాటిని ప్రయోగిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు.
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవ్వాళ ఆయన న్యూఢిల్లీలో సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో సీబీఐ అధికారులు ఎవరిపై దాడులు సాగిస్తోన్నారో.. వారంతా అత్యంత శక్తిమంతులని, సుదీర్ఘకాలంగా ప్రభుత్వం, ఇతర వ్యవస్థలో పాతుకు పోయారని ప్రతిపక్షాల గురించి పరోక్షంగా విమర్శించారు. తమ పలుకుబడితో వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు.

అలాంటి రాజకీయ శక్తులు.. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అలాంటి వారిపై తమ దాడులను తీవ్రతరం చేయాల్సి ఉంటుందని సీబీఐ అధికారులకు సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారనే కారణంతో వారిని వదిలేయాల్సిన పని లేదని చెప్పారు. సీబీఐ అధికారులు తమ పని తాము చేసుకుంటూ వెళ్లాలని, తమ దృష్టి మొత్తం విధి నిర్వహణ మీదే ఉంచాలని అన్నారు. ప్రధాని మోదీ వారికి దిశా నిర్దేశం చేశారు.
10 సంవత్సరాల కిందట దేశంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయి ఉండేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఎన్నో భారీ కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, నిందితులు ఏ మాత్రం భయపడలేదని అన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వారికి కొన్ని వ్యవస్థలు అండగా నిలవడమేనని చెప్పారు. 2014 తరువాత అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా తాము యుద్ధాన్ని ప్రకటించామని, అదే తీవ్రతతో అవినీతిపరులపై దాడులు చేయిస్తోన్నామని అన్నారు.
అవినీతిపరులపై సాగిస్తోన్న దాడులను చూసిన అనంతరం సామాన్యుల్లో సీబీఐ పట్ల ఆశ కలిగిందని, తమకు ఓ అండ లభించిందనే ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. న్యాయానికి బ్రాండ్గా సీబీఐ ఇప్పుడు ఆవిర్భవించిదని మోదీ కితాబిచ్చారు. సీబీఐ విచారణల కోసం ప్రజలు డిమాండ్ చేయడం మొదలు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. సీబీఐ వంటి సమర్థవంతమైన సంస్థలు లేకుండా భారత్ ముందుకు సాగదని చెప్పారు. బ్యాంకు మోసాల నుంచి వన్యప్రాణులకు సంరక్షణ వరకు సీబీఐ పరిధి పెరిగిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications