చైనాపై ముప్పేటదాడి.. తగ్గని భారత్.. యుద్ధసన్నద్ధతపై ఐరాస జోక్యం.. మరో షాకిచ్చిన అమెరికా
భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. రెండు దేశాల సైన్యాలు ఓ వైపు విఫల చర్చలు సాగిస్తూనే.. మరోవైపు పోటాపోటీగా మోహరింపులు చేపట్టాయి. ప్రధానంగా తూర్పు లదాక్, సిక్కిం సరిహద్దుల్లో గురువారం నాటికి పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి. లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయలో ఇరు వైపుల సైనికులు ముఖాముఖి తలపడే స్థితి నెలకొంది. రెండు దేశాలూ యుద్ధానికి సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుండటంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు..
Recommended Video

చైనాను దిగ్భందించేలా..
ఇప్పటికే కరోనా విషయంలో చైనా తీరును తప్పుపట్టిన అంతర్జాతీయ సమాజం.. తాజాగా భారత సరిహద్దుతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ అది సాగిస్తోన్న అరాచకాలకు కళ్లెం వేసే దిశగా ముప్పేటదాడిని ముమ్మరం చేసింది. ప్రధానంగా అగ్రరాజ్యం అమెరికా.. భారత్ పై చైనా దూకుడును మొదటి నుంచీ గర్హిస్తుండగా, ఇప్పుడు టిబెట్, హాంకాంగ్ అంశాల సైతం హైలైట్ చేస్తూ డ్రాగన్ బండారాన్ని బయటపెడుతున్నది. భారత్ కోరకుండానే అమెరికా, ఇతర దేశాలు చైనాపై ఎదురుదాడికి రెడీ కావడం గమనార్హం.

ఐరాస కీలక సూచన..
జనాభాపరంగానేకాక సైన్యం, అణ్వాయుధ సంపత్తి పరంగానూ అతి పెద్ద దేశాలైన భారత్-చైనాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. టెన్షన్ మరింత పెరగకుండా, సమస్యల పరిష్కారం కోసం రెండు దేశాలూ అవసరమైనమేరకు కృషిచేయాలని సూచించింది. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ అధికారిక ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే, ఇప్పటికిప్పుడు ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వానికి ప్రయత్నించబోదన్న ఆయన.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీడియేషన్ ఆఫర్ పై నిర్ణయం తీసుకోవాల్సింది భారత్, చైనాలే అని అన్నారు. ఇదిలాఉంటే, ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనపై భారత్, చైనాలో ఏ ఒక్కటీ సానుకూలంగా స్పందించలేదు. విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని, మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించబోమని చైనా స్పష్టం చేసింది.

నోటితో ఒకలా.. చేతలు ఇంకోలా..
ఐరాస సూచన, ప్రపంచ దేశాల ప్రయత్నాల నేపథ్యంలో చైనా ఒకింత తగ్గినట్లే తగ్గి మళ్లీ జడలు విప్పింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్న అర్థంలో చైనా సర్కారు తన సైన్యాలను ఆదేశించగా.. భారత్లోని చైనా రాయబారి సన్ వీడాంగ్ మాత్రం భిన్నస్వరం వినిపించారు. సరిహద్దులో రెండు దేశాలూ సంయమనం పాటిస్తున్నాయని, సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. వీడాంగ్ ప్రకటపై భారత వైపు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పైకి సంయమనం అంటూ.. సరిహద్దులో పెద్ద ఎత్తున సైన్యాలను మోహరించడం చైనా ద్వంద్వ విధానాలకు అద్దం పడుతున్నదని డిఫెన్స్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

టిబెట్ అంశం తెరపైకి..
చైనా ఆగడాలను అడ్డుకోవడంలో భాగంగా అమెరికా ఇప్పుడు ‘టిబెట్' అంశాన్ని లేవనెత్తింది. సైనిక అవసరాల పరంగా చైనా.. టిబెట్ పీఠభూమిని కీలక స్థావరంగా మార్చుకున్నసంగతి తెలిసిందే. అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ సభ్యుడైన స్కాట్ పెరీ.. బుధవారం కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. చైనా స్వాధీనంలోని టిబెట్ ను ప్రత్యేకదేశంగా గుర్తించాలని, అదేసమయంలో హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని గుర్తించాలని బిల్లుల్లో పేర్కొన్నారు. ఈ బిల్లుల్ని ప్రస్తుతం హౌస్ కమిటీ పరిశీలన కోసం పంపారు. టిబెట్ భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని భారత్ సైతం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది. తాజా వివాదానికి కారణమైన పాంగాంగ్ సరస్సు సైతం టిబెట్ కు చెందిందే అయినా.. పెత్తనం మాత్రం చైనా సాగిస్తున్నది..

పాంగాంగ్ ‘ఫింగర్స్’..
తూర్పు లదాక్ లోని దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) మధ్య భారత్ నిర్మించిన 255 కిలోమీటర్ల రోడ్డు అక్రమమని, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని వాదిస్తోన్న చైనా.. గడిచిన 20 రోజులుగా సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో భారత కార్యకలాపాలకు అడ్డుతగులుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ప్రధానంగా పాంగాంగ్ సరస్సు.. ఇద్దరికీ కీలకం కావడంతో దాని చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొందిప్పుడు. 134కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో మొత్తం 600చదరపు కిలోమీటర్లు విస్తరించిఉన్న ఈ సరస్సు 60 శాతం టిబెట్ ఆధీనంలో ఉంది. కానీ టిబెట్ ఇప్పుడు చైనా ఆధీనంలో ఉంది. ఈ సరస్సుకు ఉత్తరంగా ఉండే పర్వతాలను రెండు దేశాల సైన్యాలు ‘ఫింగర్స్'అని పిలుస్తాయి.

భారత్ మంత్రం స్టేటస్ కో..
పాంగాంగ్ సరస్సు దగ్గరున్న పర్వతాల్లో ఫింగర్ 8 వరకూ భూభాగం భారత్ దికాగా, చైనా మాత్రం ఏకంగా ఫింగర్ 2 కూడా తనదేనని వాదిస్తుంది. ఫింగర్ 4 ప్రాంతం నుంచి చూస్తే భారత్ వైపు ఏం జరుగుతుందో, సైన్యం కదలికలు అన్నీ తెలుసుకునే వీలుండటంతో దాన్ని ఆక్రమించేందుకు చైనా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నది. భారత్ ఎప్పటికప్పుడు డ్రాగన్ ను నిలువరిస్తున్నది. ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోలా ‘స్టేటస్ కో'కు భారత్ పట్టుపడుతూనే, అవసరమైన సమయంలో ఎదురుదాడికి కూడా సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications