India China Border Issue: జవాన్ల మృతితో భగ్గుమన్న భారత్ ... బాయ్ కాట్ చైనా అంటూ మరోసారి ఉద్యమం
గాల్వన్ వ్యాలీలో భారత్ - చైనా ఆర్మీకి మధ్య చోటు చేసుకున్న ఘర్షణలపై భారత ఆర్మీ కల్నల్ తో పాటుగా 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. ఇక ఈ ఘర్షణతో మరోమారు భారత్-చైనా పై భగ్గుమంది. చైనాను సమూలంగా బహిష్కరించాలని అంటోంది . చైనా తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
జవాన్ల మృతి.. దేశం ఊహించని షాక్
ఇప్పటికే కరోనా వైరస్ విషయంలో ప్రపంచమంతా చైనా పై దుమ్మెత్తి పోస్తున్న సమయంలో, చైనా, లడక్ లోని వాస్తవాధీన రేఖ వద్ద కొద్దిరోజులుగా కవ్వింపు చర్యలకు దిగుతూ భారతదేశ సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక దీంతో భారత్ చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒకపక్క సామరస్యపూర్వకంగా చర్చలు జరపాలని చూస్తున్న సమయంలో ఊహించని విధంగా జరిగిన పరిణామంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
డ్రాగన్ కంట్రీ చైనాపై భగ్గుమంటున్న భారత్
20 మంది భారత జవాన్లు చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు పోగొట్టుకోవడంతో దేశం గుండె పగిలింది. ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే చైనా వస్తువులను, చైనా యాప్స్ ను బహిష్కరించాలని నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన వారంతా ఇప్పుడు మరో ఉద్యమం మొదలుపెట్టారు. అసలు చైనాను భారతదేశం ప్రతి విషయంలోనూ బహిష్కరించాలి అంటూ కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు.
ప్రభుత్వం చేపట్టే టెండర్లలో చైనా సంస్థల బహిష్కరణ డిమాండ్
చైనా సైన్యం తో జరిగిన ఘర్షణలో భారత సైనికులు ప్రాణాలు పోగొట్టుకోవడంపై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ గట్టిగానే ఫైర్ అయింది. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన జవాన్లకు నివాళిగా ప్రభుత్వం చేపట్టే టెండర్లలో చైనా కంపెనీలు పాల్గొనకుండా నిషేధం విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఇక అంతే కాదు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని గట్టిగానే తమ నినాదాన్ని చెప్తున్నారు. నటీనటులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు ఎవరైనా సరే చైనా ఉత్పత్తులను ప్రోత్సహించి వద్దని చాలామంది ఉద్యమం లేవదీస్తున్నారు.
మన సైన్యాన్ని చంపటానికి ఎంత ధైర్యం అంటున్న రాజకీయ వర్గాలు
ఇక తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులు మాత్రం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలని చైనాకు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా జవాన్ల మరణాలను చాలా సీరియస్ గా తీసుకుని అన్ని రాజకీయ పార్టీలతో జూన్ 19న సాయంత్రం ఐదు గంటలకు వర్చువల్ మీటింగు నిర్వహించబోతున్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా చైనా పై మండిపడ్డారు. మన సైన్యాన్ని చంపటానికి ఎంత ధైర్యం అంటూ ఆయన నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. మన భూమి కాజేయడానికి చైనా వారికి ఎంత ధైర్యం అంటూ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
Recommended Video
సర్జికల్ స్ట్రైక్ స్పెషలిస్ట్ మోడీ చైనా విషయంలో ఏం చేస్తారో ?
ఏదేమైనప్పటికీ చైనా పై సమర శంఖం పూరించాల్సిన సమయం అని తాజా పరిణామాల నేపథ్యంలో భారతదేశం భగ్గుమంటోంది. అమరవీరుల ఆత్మ శాంతించాలంటే, నాడు పాకిస్తాన్ పై చేసిన విధంగా సర్జికల్ స్ట్రైక్ చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి డ్రాగన్ కంట్రీ విషయంలో భారతీయుల నుండి వినిపిస్తున్న డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారు. .. ఏం చేస్తారు అన్నది ప్రస్తుతం టెన్షన్ గా మారింది.