ఎట్టకేలకు... ప్యాంగాంగ్లో సైన్యం ఉపసంహరణ పూర్తి... సైనికులు,యుద్ద ట్యాంకులు,అంతా ఖాళీ...
భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించేలా... ఎట్టకేలకు 9 నెలల తర్వాత ఓ కీలక ప్రక్రియ పూర్తయింది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ,ఉత్తర తీరాల్లో ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. నిజానికి ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించినప్పటికీ.. అంతకన్నా ముందే ఇది పూర్తవడం విశేషం. తొలి దశ సైనిక బలగాల ఉపసంహరణ పూర్తవడంతో భారత్-చైనా మధ్య శనివారం(ఫిబ్రవరి 20) 10వ విడత చర్చలు జరగనున్నాయి.

సైనికులు,యుద్ద ట్యాంకులు... అంతా ఖాళీ..
ప్యాంగాంగ్ త్సో దక్షిణ,ఉత్తర తీరంలోని మిలటరీతో పాటు యుద్ద ట్యాంకులు ఇతరత్రా మిలటరీ పరికరాలన్నింటినీ ఇరు దేశాలు అక్కడినుంచి తరలించేశాయి. మాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు ఆ ప్రాంతంలో కనిపించిన చైనా మిలటరీ స్థావరాలను ఇప్పుడు తొలగించేశారు.దక్షిణ తీరం నుంచి డ్రాగన్ తమ యుద్ధ ట్యాంకులను వేగంగా తరలించిన చైనా... ఉత్తర తీరంలో ఎలా వ్యవహరిస్తుందోనని ఒకింత ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా త్వరగానే పూర్తవడంతో... మున్ముందు మిగతా ప్రాంతాల్లోనూ త్వరితగతిన సైనిక బలగాల ఉపసంహరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 9 నెలలుగా భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో ఎట్టకేలకు సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుండటం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

తదుపరి ఎజెండా ఏంటి...
ఈ నేపథ్యంలో తూర్పు లదాఖ్లోని మిగిలిన ఘర్షణ ప్రాంతాల నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై శనివారం జరగబోయే సమావేశంలో చర్చించనున్నారు. భారత్-చైనా కార్ప్స్ కమాండర్ మధ్య జరిగే ఈ సమావేశం ప్యాంగాంగ్ దక్షిణ తీరంలోని చుశూల్-మోల్దో ప్రాంతంలో జరగనుంది. ప్రధానంగా గోగ్రాతో పాటు దెస్పాంగ్,హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిదశలోనూ పరస్పర అంగీకారం,ఆమోదంతోనే ముందుకు వెళ్లనున్నట్లు ఇప్పటికే భారత ఆర్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

9 నెలల ప్రతిష్ఠంభనకు తెర...
తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్, చైనాల మధ్య గతేడాది జూన్ నుంచి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన హింసాత్మక దాడిలో 20 మంది భారత సైనికులు అమరులవడంతో ఇది తారాస్థాయికి చేరింది. ఈ ఘర్షణలో చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగినప్పటికీ డ్రాగన్ చాలారోజులు దీనిపై మౌనం వహించింది. ప్యాంగాంగ్ త్సోలో సైన్యం ఉపసంహరణ ప్రక్రియకు కొద్ది గంటల ముందు ఎట్టకేలకే దీనిపై స్పందించింది. ఐదుగురు చైనా జవాన్లు ఈ హింసాత్మక ఘర్షణలో మృతి చెందినట్లు వెల్లడించింది. కారాకోరం మౌంటెయిన్ రేంజ్కు చెందిన ఫ్రాంటియర్ ఆఫీసర్లు, సైనికులు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సెంట్రల్ మిలటరీ కమిషన్ ఆఫ్ చైనా (సీఎంసీ) ప్రకటించింది. వీరికి యుద్ధ స్మారక అవార్డులను ప్రధానం చేసింది. భారత్తో సరిహద్దులో నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడుతున్న వేళ చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications