బోర్డర్ ఇష్యూ... భారత్-చైనా మధ్య నేడు డబ్ల్యూఎంసీసీ సమావేశం...?
తూర్పు లదాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించి భారత్-చైనా మధ్య గురువారం(అగస్టు 20) వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్&కో ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ సమావేశం ఈ నెల 20వ తేదీన జరుగవచ్చునన్న కథనాలు వచ్చినప్పటికీ... తాజా జాతీయ మీడియా కథనాలు మాత్రం గురువారం సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. దెస్పాంగ్,గోగ్రా తదితర ఫింగర్ ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణకు చైనా మొండికేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది.
జూన్ 15న గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా బలగాల ఘర్షణ తర్వాత మిలటరీ స్థాయి చర్చలు కొనసాగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్తతలకు తెరదించేలా ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ... ప్యాట్రోల్ ఫింగర్ పాయింట్ 14 వద్ద ఇప్పటికీ చైనా స్థావరాలు ఉన్నట్లుగా ఇటీవల కొన్ని శాటిలైట్ చిత్రాలు బయటపెట్టాయి.
గాల్వన్ వ్యాలీలో ఇప్పటికీ చైనాకు సంబంధించి భారీగా వాహనాలు కదలికలు ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. అంతేకాదు, వాస్తవాధీన రేఖ నుంచి కి.మీ కన్నా తక్కువ దూరంలో ఉన్న గాల్వన్ నదిపై చైనా ఆర్మీ ఓ కల్వర్టును కూడా నిర్మిస్తున్నట్లు వెలుగుచూసింది. ఈ పరిణామ నేపథ్యంలో వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్&కో ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశంలో వీటిపై చర్చించే అవకాశం ఉంది.
కాగా,జూన్ 15న గాల్వన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. చైనా జవాన్లు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయినా డ్రాగన్ క్లారిటీ ఇవ్వలేదు. భారత జవాన్ల బలిదానాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం చైనాను ఆర్ధికంగా కూడా దెబ్బతీయాలని నిర్ణయించి 59 యాప్లను నిషేధించింది. చైనాతో కుదిరిన టెండర్లను రద్దు చేసుకుంది. భవిష్యత్తులోనూ వాణిజ్య కార్యకలాపాలు జరపరాదని నిర్ణయించింది.