చర్చల పేరుతో చైనా దొంగదెబ్బ: సరిహద్దుల్లో భారత సైన్యంపై దాడి: కమాండింగ్ అధికారి, జవాన్లు మృతి
న్యూఢిల్లీ: చైనా మరోసారి భారత్ను దొంగదెబ్బ కొట్టింది. ఒకవంక చర్చలు కొనసాగిస్తూనే మరోవంక దాడులకు పాల్పడుతోంది. తాజాగా మంగళవారం లఢక్ సమీపంలోని గాల్వన వ్యాలీ సమీపంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో భారత్కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులు అయ్యారు. మరణించిన వారిలో ఓ కమాండింగ్ అధికారి ఉన్నారు. ఈ ఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్యంగా.. ఎలాంటి ముందుస్తు హెచ్చరికలు లేకుండా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఈ సంఘటనను భారత ఆర్మీ ధృవీకరించింది. లఢక్ సెక్టార్ సమీపంలోని ఈశాన్య ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకం, సమస్యాత్మక ప్రాంతంగా భావించే గాల్వన్ వ్యాలీ సమీపంలో భారత్, చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ఆర్మీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటనలో భారత్ ప్రాణనష్టాన్ని చవి చూసిందని, ఇది దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించారు. ఓ కమాండింగ్ అధికారి సహా ఇద్దరు జవాన్లు అమరులు అయ్యారని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని నియంత్రించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Recommended Video
గాల్వన్ వ్యాలీ, పెట్రోలింగ్ పాయింట్-15, హాట్ స్ప్రింగ్స్, ఫోర్ ఫింగర్స్ పాయింట్ వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. లఢక్ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ నెల 6వ తేదీన భారత్, చైనా మధ్య చర్చలు కొనసాగాయి. భారత్ తరఫున లేహ్లోని 14 కార్ప్స్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దక్షిణ గ్ఝిన్జియాంగ్ రీజీయన్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొన్నారు. మరి కొద్దిరోజుల్లో రెండో దఫా చర్చలు కొనసాగాల్సి ఉంది. అదే సమయంలో రెండు దేశాల సరిహద్దు సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం ముగ్గురు మరణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.