20వేల మార్క్ దాటిన కరోనా కేసులు, 641 మరణాలు: ఆ మూడు రాష్ట్రాల్లోనే సగం కేసులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో మంగళవారం ఎక్కువ కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్కును దాటడం గమనార్హం.

20వేల మార్క్ దాటిన కేసులు..
దేశ వ్యాప్తంగా మంగళవారం నాటికి 20,004 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 641 మరణాలు సంభవించాయి. 15,462 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3,901 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్రలో భారీగా పెరిగిన కేసులు, మరణాలు
కాగా, మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రంలో 552 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహారాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5218కి చేరగా, మరణాల సంఖ్య 251కి చేరింది. మొత్తం 722 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, తాజాగా నమోదైన 552 కేసుల్లో 419 కేసులు ముంబై నగరంలోనే నమోదు కావడం గమనార్హం. ముంబై నగరంలో 3451 కేసులు నమోదు కాగా, 151 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్ర తర్వాత గుజరాత్, ఢిల్లీలోనే..
మహారాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఇక్కడ 232 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 2178కి చేరింది. ఇప్పటి వరకూ కరోనా కేసుల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, తాజాగా గుజరాత్ ఆస్థానానికి చేరింది. ఢిల్లీ మంగళవారం 75 కొత్త కేసులు నమోదయ్యాయి. 180 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో 1498 యాక్టివ్ కేసులుండగా, 611 మంది కోలుకున్నారు. 47 మంది మృతి చెందారు.
ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 2156 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలోని దాదాపు సగానికిపైగా కేసులు ఈ మూడు రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం.












Click it and Unblock the Notifications