ఏం జరుగుతోంది: తీర ప్రాంతంలో యుద్ధ నౌకలను మోహరించిన ఇండియన్ నేవీ
న్యూఢిల్లీ: ఉత్తర అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన తమ దేశ నావికాదళ విన్యాసాలపై భారత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అరేబియన్ సముద్రంలో గస్తీని పటిష్టం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని యుద్ధ నౌకలు, జలాంతర్గామిలను, యుద్ధ మిమానాలను మోహరించింది. పాక్ ఎలాంటి కుట్రలకు పాల్పకుండా ఎదుర్కొనేందుకు భారత నావికాదళం అలర్ట్ అయ్యింది.
ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా: మూహుర్తం ఖరారు: ఎలక్ట్రికల్ బస్సుల పైనా..!
అరేబియన్ సముద్రంలో పాక్ నావికాదళ విన్యాసాలు
అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ నావికాదళ విన్యాసాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు క్షిపణులను, రాకెట్లను యుద్ధవిమానాలతో విన్యాసాలు చేయనున్నట్లు సమాచారం. నావికాదళ విన్యాసాల పేరుతో పాకిస్తాన్ కుట్రలకు తెరతీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా భారత బలగాలను అరేబియన్ సముద్రంలోకి పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ విశ్వసనీయ సమాచారం.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ దుశ్చర్యలు
ఏటా రిబత్ పేరుతో ఈ విన్యాసాలను పాక్ నిర్వహిస్తోందని కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని డిఫెన్స్ వర్గాలు చెప్పాయి. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ కొన్ని దుశ్చర్యలకు పాల్పడుతోందని చెప్పిన భారత్... నావికా దళం విన్యాసాల పేరుతో ఏమైనా చేసే అవకాశం ఉందని వెల్లడించింది. మన జాగ్రత్తల్లో మనం ఉండకుంటే అదే అదునుగా పాక్ రెచ్చిపోయే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తెలిపాయి.
పాక్ కుట్రకు తెరతీసే అవకాశం ఉంది
ఇప్పటికే పాకిస్తాన్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కమర్షియల్ నౌకలకు అలర్ట్ జారీ చేసింది. విన్యాసాలు జరుగుతున్నందున ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 25 నుంచి 29వరకు ఈ విన్యాసాలు జరగనున్నాయి. పాకిస్తాన్ చేస్తున్న విన్యాసాలపై భారత్ ఓ కన్నేసి ఉంచినట్లు డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. యుద్ధనౌకలు, జలాంతర్గామిలతో పాటు గస్తీ కోసం పోసీడాన్ -81 ఎయిర్క్రాఫ్ట్లను కూడా వినియోగిస్తోంది.
బాలాకోట్ దాడుల తర్వాత తీరప్రాంతంలో గస్తీ పటిష్టం
పుల్వామా దాడుల ప్రతీకారచర్యల్లో భాగంగా భారత వాయుసేన బాలాకోట్ పై దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా భారత్పై సముద్రమార్గం ద్వారా దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ తీర ప్రాంతాన్ని అలర్ట్ చేసింది. యుద్ధ విమానాలను మోసుకెళ్లే ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ చక్రలను అరేబియన్ సముద్రంలో మోహరించింది. ఇక ఉపరితలం, సముద్రమార్గం, భూమిపై అన్ని ద్వారాలను భారత్ టైట్ చేయడంతో పాకిస్తాన్ ఆటలు సాగలేదని భారత నేవీ తెలిపింది.