షాకింగ్ రిపోర్ట్: తీవ్రంగా దెబ్బతిన్న ఆసియా దేశాల్లో భారత్ టాప్: కరోనా కేసుల్లో 30 శాతం వాటా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉప్పెనలా మారింది. రోజురోజుకూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 63 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ మరణమృందంగా ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు. అదే సమయంలో అన్లాక్-4 అమల్లోకి రానుంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ దుష్ప్రభావాన్ని చూపింది.
Recommended Video
ఆసియా దేశాల్లో తీవ్రంగా దెబ్బతిన్న భారత్..
రోజుల తరబడి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఫలితంగా- రోజువారీ లావాదేవీలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానా ఖాళీ అయింది. అన్లాక్ తరువాత పరిస్థితులు స్వల్పంగా మెరుగుపడ్డాయే తప్ప ఆశించిన స్థాయిలో రాబడి ఉండట్లేదంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి.. చేస్తున్నాయి. దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులకు అద్దం పట్లేలా తాజాగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐపీహెచ్ఎ) ఓ నివేదికను రూపొందించింది. ఆసియాలో ఖండంలో కరోనా వైరస్ దుష్ప్రభావానికి తీవ్రంగా లోనైన దేశం భారతేనని వెల్లడించింది.
కరోనా కేసుల్లో భారత్ వాటా 30 శాతం వరకు..
ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐపీహెచ్ఎ) ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఎపీఎస్ఎం) ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ డెమాలజిస్ట్స్ (ఐఏఈ) - ఈ మూడూ ప్రధానమైన ప్రజారోగ్య సంస్థలు. ఈ మూడు సంస్థలకు చెందిన ప్రతినిధులు ప్రజారోగ్యంపై నిర్వహించిన సర్వే ఆధారంగా తమ నివేదికను రూపొందించారు. కరోనా వైరస్ ప్రభావాన్ని లెక్క గట్టారు.
ఆసియాలో మరే దేశం కూడా ఈ స్థాయిలో దెబ్బతిన లేదని పేర్కొంది. ఆసియాలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో రోజువారీగా పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ కేసుల్లో భారత్ వాటా 30 శాతం వరకు ఉంటోందని వెల్లడించింది.
సీసీఎఫ్ రేషియో తగ్గినా..
కరోనా మరణాల్లో 20 శాతం భారత్లోనే నమోదవుతున్నాయని స్పష్టం చేసింది. కరోనా పేషెంట్లు వేగవంతంగా కోలుకోవడం ఆశాజనక పరిస్థితులను కల్పిస్తున్నాయని ఐపీహెచ్ఎ అభిప్రాయపడింది. కరెక్టెడ్ కేస్ ఫటాలిటీ రేషియో (సీసీఎఫ్ఆర్) క్రమంగా తగ్గుముఖం పట్టిందని స్పష్టం చేసింది. ఇవే తరహా పరిస్థితులు మున్ముందు కొనసాగించాల్సి ఉంటుందని అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగా నమోదైందని, ఆగస్టు 16వ తేదీ నాటి రీప్రొడక్షన్ నంబర్ 1.06ను పరిగణనలోకి తీసుకుంటే.. భారత్లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు గరిష్ఠస్థాయికి చేరుకోవడానికి ఇంకా సమయం ఉందని పేర్కొంది.
సామూహిక వ్యాప్తికి సంకేతాలు..
దేశంలో జూన్ 5వ తేదీ నాటికి 9472 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆగస్టు 23వ తేదీ నాటికి ఆ సంఖ్యం 61,749కి చేరుకుందని, ఈ రెండు నెలల కాలం అన్లాక్ పీరియడ్ కావడం.. పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైనట్లు తెలిపింది. ప్రతి పదిలక్షల మంది జనాభాకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2251గా నమోదైందని ఐపీహెచ్ఎ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తికి చేరుకుందనే విషయాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. మధ్యస్థాయి పట్టణాలు, గ్రామాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉంటోందని ఐపీహెచ్ఎ తన నివేదికలో పొందుపరిచింది.