తెలంగాణలో అంతకంతకూ ఒమిక్రాన్: 578కి చేరిన పాజిటివ్ కేసులు: రాష్ట్రాలవారీగా లెక్కలివే
న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ భీకరంగా విస్తరిస్తోంది. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే- ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో వందకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారి సంఖ్య 578కి చేరింది. ఒమిక్రాన్ వల్ల ఇప్పటిదాకా మరాణాలేవీ నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది.
దేశంలో ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియంట్ 19 రాష్ట్రాలకు విస్తరించింది. కొత్తగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్.. ఒమిక్రాన్ బాధిత రాష్ట్రాల జాబితాలో చేరాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 578కి చేరగా.. ఇందులో 151 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 427గా రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలవారీగా వాటి సంఖ్యను వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్రల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఈ రెండు చోట్ల కూడా 283 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇందులో ఢిల్లీ-142, మహారాష్ట్ర-141 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 23, మహారాష్ట్రలో 42 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. మూడో స్థానంలో కేరళ నిలిచింది. ఇక్కడ 57 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. గుజరాత్, రాజస్థాన్, తెలంగాణల్లో 40కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్-49, రాజస్థాన్-43, తెలంగాణ-41 కేసులు వెలుగు చూశాయి.
తమిళనాడు-34, కర్ణాటక-31, మధ్యప్రదేశ్-9, ఆంధ్రప్రదేశ్-6, పశ్చిమ బెంగాల్-6, హర్యానా-4, ఒడిశా-4, చండీగఢ్-3, జమ్మూ కాశ్మీర్-3, ఉత్తర ప్రదేశ్-2 కేసులు రికార్డయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, లఢక్, ఉత్తరాఖండ్లల్లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కోవిడ్ ప్రొటోకాల్స్ను పాటించాలని సూచించింది.
ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు పెరుగుతోండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది.పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ ప్రొటోకాల్స్ను జారీ చేశాయి. దీనితోపాటు బూస్టర్ డోసులను అందుబాటులోకి తీసుకుని రానుంది కేంద్ర ప్రభుత్వం. జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసులను వేయడానికి సన్నాహాలు చేస్తోంది.