చైనాకు చెక్ : రాజస్థాన్ లో భారీ లిథియం నిక్షేపాలతో భారత్ పంట పండినట్టే!!
దేశంలోని రాజస్థాన్లో అత్యంత ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్టు కనుగొన్నారు.రాజస్థాన్ లో లక్షల కోట్ల విలువైన భారీ లిథియం నిల్వలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా,మరియు మైనింగ్ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్లో లభించే ఈ లిథియం ఖనిజ పరిమాణం మన దేశ అవసరాలను 80% తీర్చగలరని అధికారులు చెబుతున్నారు.దీంతో భారత్ దశ తిరిగినట్టే అంటున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని డేగానాలోని రెన్వాత్ కొండ ప్రాంతంలో నిధి నిక్షేపాలు ఉన్నట్టు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్లో గుర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్థాన్లో అత్యంత అధికంగా లిథియం నిల్వలు ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశం లిథియం ను దిగుమతి చేసుకుంటుంది. తాజా లిథియం నిల్వల గుర్తింపుతో భారతదేశంలో ఉన్న డిమాండ్ గణనీయంగా తీరుతుందని చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో లిథియం ను ఎక్కువగా ఉపయోగిస్తారు. లిథియం ప్రపంచవ్యాప్తంగా తేలికైన మరియు ఒక మృదువైన లోహం. ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఉపయోగించే బ్యాటరీ లలో కీలకంగా ఉపయోగపడుతుంది. లాప్ ట్యాప్ లు, ఫోన్లు, బ్యాటరీల తయారీలో లిథియం ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని లిథియం ఉత్పత్తిలో 47% ఆస్ట్రేలియాలో, 30 శాతం చిలీలో, 15 శాతం చైనాలో జరుగుతుంది.
లిథియం ప్రోసెసింగ్ లో 58 శాతం చైనాలో, 10తో అర్జెంటీనాలో 29% చిలీలో జరుగుతుంది. తాజాగా లిథియం నిక్షేపాలు రాజస్థాన్ లో భారీగా ఉన్నాయని గుర్తించడంతో భారతదేశం విదేశాలపై ఆధారపడటం తగ్గించగలదని, మేకిన్ ఇండియా చొరవ కూడా అందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ పరిణామం భారతదేశం తన దేశ అవసరాలను తీర్చడానికి మాత్రమే కాకుండా,ఇతర దేశాలకు లిథియం సరఫరా చేయడానికి కూడా దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
భారతదేశంలో ఈవీ పరిశ్రమకు లిథియం నిక్షేపాలు ఉండటం ఊతం ఇస్తుందని, మంచి భవిష్యత్తును సృష్టిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు భారతదేశం లిథియం కోసం ప్రధానంగా చైనా పై ఆధారపడుతుంది. తాజాగా రాజస్థాన్లో భారీగా లిథియం నిల్వలు బయటపడడంతో చైనా గుత్తాధిపత్యానికి చెక్ పడుతుందని భావించొచ్చు.












Click it and Unblock the Notifications