మిలియనీర్ల దేశమే!: జాబితా టాప్ 10లో భారత్
న్యూఢిల్లీ: భారత్ ఓ వైపు కోట్లాది మంది పేదలకు నిలయమైనప్పటికీ.. మరోవైపు వందల కోట్ల సంపద కలిగిన శ్రీమంతులు కలిగిన ప్రపంచంలోని టాప్-10దేశాల్లో నిలిచింది. ఈ జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. దేశంలో 14,800 మంది మిలియనీర్లు ఉన్నారని ‘న్యూ వరల్డ్ వెల్త్' నివేదిక పేర్కొంది. అంతేకాదు, 2700 మంది మిలియనీర్లలో దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రపంచవ్యాప్తంగా టాప్ 25 దేశాల్లో ఒకటిగా ఉందని ఆ నివేదిక తెలిపింది.
15,400 మంది మిలియనీర్లతో హాంకాంగ్ ఈ జాబితాలో ప్రథమస్థానంలో ఉంది. మిలియనీర్లకు సంబంధించి మన దేశం ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఒక్క ముంబైకి మాత్రమే ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో స్థానం లభించడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం కోటీ 30 లక్షల మంది మాత్రమే మిలియనీర్లు ఉన్నారని, వీరిలో 4,95,000 మందిని మల్టీ మిలియనీర్లుగా వర్గీకరించవచ్చని ‘న్యూ వరల్డ్ వెల్త్' నివేదిక పేర్కొంది. ఈ సర్వే కోసం ఆ సంస్థ పది లక్షల అమెరికన్ డాలర్ల సంపద ఉన్న వ్యక్తిని మిలియనీర్గాను, అలాగే కనీసం కోటి (పది మిలియన్లు) డాలర్ల సంపద ఉన్న వ్యక్తిని మల్టీ మిలియనీర్గాను వర్గీకరించింది.
కాగా, ఈ సర్వే ప్రకారం అమెరికాలో అత్యధికంగా లక్షా 83 వేల మంది మల్టీ మిలియనీర్లు ఉండగా, 26,600 మందితో చైనా, 25,400 మందితో జర్మనీ వరసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు కాకుండా అత్యధికంగా మల్టీ మిలియనీర్లు ఉన్న టాప్-10 దేశాల్లో వరుసగా బ్రిటన్, జపాన్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, భారత్, రష్యా ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్లు, మల్టీ మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.