చైనాకు గట్టి షాకివ్వబోతున్న భారత్?
చైనాకు భారత్ మరోసారి షాకిచ్చింది. గాల్వన్ లోయ ఘటన తర్వాత 300కు పైగా చైనా యాప్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు మరోసారి డ్రాగన్ కు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమైంది. 12 వేల రూపాయల ధరల విభాగంలో ఫోన్లను విక్రయించకుండా చైనా కంపెనీలపై ఆంక్షలు విధించేందుకు ఆలోచన చేస్తోంది. భారత్ లో అమ్మడవుతున్న టాప్-5 మొబైల్స్ బ్రాండ్స్ లో ఒప్పో, వివో, రియల్ మి, వన్ప్లస్, షావోమి, ఐకూ వంటివి ఉన్నాయి. ఈ నిర్ణయంతో వీటికి గట్టి షాక్ తగలబోతోంది.
షావోమి, రియల్ మి వంటి కంపెనీలపై అధిక ప్రభావం ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ మార్కెట్ గా ఉన్న భారత్ లో లోయర్ సెగ్మెంట్ నుంచి చైనాను పంపించాలనే యోచనలో కేంద్రం ఉందనే వార్తలు వస్తున్నాయి. చైనా కంపెనీలవల్ల స్థానిక కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
డీలర్లకు 30 నుంచి 40 శాతం దాకా కమీషన్లు ఇస్తుండటంతో ఆన్ లైన్ లోకానీ, ఆఫ్ లైన్ లోకానీ అందరూ వాటినే అమ్ముతున్నారు. దేశీయ కంపెనీలు 10 నుంచి 12 శాతమే కమీషన్ ఇస్తున్నాయి. నెలకో కొత్తమోడల్ విడుదల చేయడం కూడా చైనా కంపెనీలకు వరంగా మారింది. కేంద్రం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విధానం తీసుకొస్తుందా? లేదా? అనేదానిపై త్వరలోనే స్పష్టత రాబోతోంది. ఇది అమల్లోకి వస్తే చైనా కంపెనీలకు గట్టి షాక్ తగలడంతోపాటు దేశీయ కంపెనీలకు ఊపిరి పోసినట్లవుతుందని భావిస్తున్నారు.